రాహుల్ పోరాటం వృథా.. మూడో మ్యాచ్ కూడా హాంఫట్

రాహుల్ పోరాటం వృథా.. మూడో మ్యాచ్ కూడా హాంఫట్

టీమిండియా మరో మ్యాచ్ చేజార్చుకుంది. ఆఖరి మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందన్న ఆశలు ఆవిరి చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీకి మించిన స్కోరుతో రాణించినా.. మ్యాచ్ నిలబెట్టుకోలేకపోయింది. టీ20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. సిరీస్‌లో మూడు మ్యాచ్‌లను చేజార్చుకుంది. భారత్ నిర్దేశించిన 297పరుగుల టార్గెట్‌ను పట్టుదలతో చేదించింది కివీస్. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. వికెట్లు చేజార్చుకుంటున్న సమయంలో కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు. మయాంక్ అగర్వాల్(1), విరాట్ కోహ్లీ(9)లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఓపెనర్ పృథ్వీ షా(40).. శ్రేయాస్ అయ్యర్(62)లు క్రీజులో నిలదొక్కుకుని నిలకడైన ఇన్నింగ్స్ కనబరిచారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కేఎల్ రాహుల్(112; 113బంతులు, 9ఫోర్లు, 2సిక్సులు)కివీస్ పై విరుచుకుపడ్డాడు. 

ఇన్నింగ్స్ చివర్లో రాహుల్ అవుట్ అవడం.. తర్వాతి బంతికే మనీశ్ పాండే(42) శాంతర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(8), శార్దూల్ ఠాకూర్(7), నవదీప్ సైనీ(8) తేలిపోయారు. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని 21 బంతులు మిగిలి ఉండగానే సాధించిన కివీస్.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్ తోనే సిరీస్ ను చేజిక్కించుకున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌తో అధికారికంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 

ఓపెనర్లు మార్టిన్ గఫ్తిల్(66), హెన్రీ నికోలస్(80) కుదురుకోవడం జట్టుకు బాగా కలిసొచ్చింది. కేన్ విలియమ్సన్(22), రాస్ టేలర్(12), టామ్ లాథమ్(32), జేమ్స్ నీశం(19) నిలకడగా ఆడి క్రమంగా స్కోరు పెంచారు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఫుల్ టాస్ బంతిని గ్రాండ్ హోమ్(58) ఫోర్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ గెలిచింది న్యూజిలాండ్.