Hyderabad: మరోసారి కుక్కల బీభత్సం.. బాలుడిని నోట కరచుకుని తీసుకెళ్లిన శునకాలు.. అడ్డుకోబోయిన వారికీ గాయాలు
Hyderabad: హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందిన ఘటన జరిగి ఒక్కరోజైనా కాలేదు.. రాజేంద్రనగర్ పరిధిలో మళ్లీ ఇటువంటి ఘటనే చోొటుచేసుకుంది. హైదర్ గూడలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బాలుడిని నోట కరచుకుని తీసుకెళ్లాయి. ఆ బాలుడి చేతిపై, తలపై తీవ్ర గాయాలయ్యాయి.
ఆ బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బాలుడికి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం అందుతోంది. కుక్కలను అడ్డుకోబోయిన ఓ బాలుడు సహా మరో ఐదుగురికీ గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, నిన్న హైదరాబాద్ అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాలుడి కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి చెప్పారు.
బాలుడు ప్రదీప్ ని కుక్కలు అతి దారుణంగా పీక్కుతిన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ దృశ్యాలు ప్రజలను కలచివేశాయి. కుక్క దాడి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని, వీధి కుక్కల నియంత్రణ చేపడతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలువురు అధికారులు నిన్న చెప్పారు. ఇవాళ మళ్లీ కుక్కల దాడి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.