ధరణితో ఎన్నో లాభాలు, ఆ సమస్యలకు చెక్

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 10:18 AM IST
ధరణితో ఎన్నో లాభాలు, ఆ సమస్యలకు చెక్

Many benefits with Telangana Dharani Portal : ధరణి అందుబాటులోకి వస్తే.. ఇకపై మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు..అంతా ఆన్‌లైన్‌లోనే.. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం.. పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. భూమి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మాన్యువల్‌ రికార్డులకు తెరపడుతుంది.



భూ రికార్డుల నిర్వహణ డిజిటలైజ్ :-
ఇకపై భూ రికార్డుల నిర్వహణ డిజిటలైజ్ అవుతుంది. ధరణి పోర్టలే భూ హక్కు రికార్డుగా పరిగణించబడుతుంది. యజమాని ఆధార్‌ కార్డు ఆధారంగానే దస్త్రాల్లో మార్పులు ఉంటాయి. అక్రమంగా భూ యాజమాన్య హక్కులు మార్చే ఆస్కారం ఉండదు. యజమాని వేలి ముద్రతోనే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇకపై సమస్యలకోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. సమస్యలను ఆన్‌లైన్‌లో తెలిపితే వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఆన్‌లైన్‌లోనే భూ రికార్డులను ఎప్పుడైనా చూసి తెలుసుకునే వీలుంటుంది. ఒకే భూమికి వేర్వేరు రికార్డుల సమస్యకు ధరణితో ఫుల్‌స్టాప్‌ పడనుంది.



https://10tv.in/cm-kcr-to-address-on-dharani-portal/
అవినీతికి చెక్ : –
ఇకపై ప్రైవేటు భూమా, ప్రభుత్వ భూమా అనేది ఇట్టే తెలిసిపోతుంది. భూ హక్కులపై సందిగ్థతకు ధరణితో తెరపడుతుంది. అడ్డగోలుగా భూ రికార్డులను మార్చే సంస్కృతికి అడ్డుకట్ట పడుతుంది. రైతులు భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
ధరణిని ప్రజలకు అందుబాటులోకి వస్తే రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి వేళ్లూనుకున్న అవినీతికి చెక్‌పెట్టడంతో పాటు.. ప్రజలకు సులభతరమైన సేవలు అందనున్నాయి. ధరణి పోర్టల్‌ రాక ముందు ఎలాంటి సమస్యలు ఉండేవి.. ధరణి పోర్టల్ వచ్చిన తరువాత ఆ సమస్యలకు ఎలా చెక్‌పడనుందో తెలుసుకుందాం..



భూ రికార్డుల్లో గజిబిజి :-
నిన్నటి వరకు… దశాబ్దాల తరబడి భూ రికార్డులలో గజిబిజి, గందరగోళం ఉండేది.. ధరణి అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ వేదికపై పూర్తి పారదర్శకంగా భూదస్త్రాల నిర్వహణ ఉండబోతోంది. ధరణికి ముందు.. సిబ్బంది చేతులు తడిపితే కానీ రికార్డు చేతికందేది కాదు.. కానీ నేటి నుంచి పైసలిస్తేనే పని చేసే సంస్కృతికి అడ్డుకట్ట పడనుంది. ఇన్నాళ్లు పహానీ నకలును పొందేందుకు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది.. ధరణితో ఆఫీసుల చుట్టూ తిప్పుకునే సంస్కృతికి చెక్‌ పడనుంది. ఇన్ని రోజులు భూ హక్కులు పొందినా రికార్డులకెక్కడానికి 2 నుంచి 6 నెలల సమయం పట్టేది.



అనుమతుల కోసం చక్కర్లు :-
ఇకపై బ్యాంకుల్లో డబ్బులు దాచుకొని.. తీసుకొనేంత సులువుగా మార్పు చేర్పులు చేసుకోవచ్చు. మ్యుటేషన్, పాస్‌ పుస్తకాల జారీలో తీవ్ర జాప్యానికి ధరణి చెల్లు చీటి చెప్పింది. అరగంటలో రికార్డుల అప్‌డేషన్, పీపీబీ జారీ, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది. భూమిపై యాజమాన్య హక్కుల కోసం వీఆర్వో నుంచి డిప్యూటీ తహసీల్దారు వరకు తిప్పుకునేవారు. సాగు భూమిని వ్యవసాయేతర రంగాలకు వినియోగించాలంటే అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరగాలి.



ఒకే భూమికి వేర్వేరు రికార్డులు :-
భూముల పంపిణీ, వారసత్వ బదిలీ కోసం వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. యజమానికి తెలియకుండా భూ రికార్డుల్లో మార్పులు చేసే అవకాశం ఉండేది. ఒకే భూమికి వేర్వేలు రికార్డులు ఉండేవి. ఈ సమస్యలన్నింటికి ధరణి స్వస్తి పలికింది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యుటేషన్‌ కూడా పూర్తి కానుంది. కుటుంబ సభ్యులు అంగీకార పత్రం రాసిస్తే తక్షణమే యాజమాన్య హక్కులు పొందనున్నారు.



భూ వివరాల్లో మార్పులు :-
యజమానికి తెలియకుండా భూ వివరాల్లో ఎటువంటి మార్పులకు ఆస్కారం లేదు. భూ రికార్డుల్లో ఏవైనా మార్పులు చేయాలంటే.. భూ యజమానికి సెల్‌నంబర్‌కు ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేసిన తరువాతే.. భూ రికార్డుల్లో మార్పు చేర్పులు చేసేందుకు వీలుంటుంది. అలాగే ధరణితో.. ఒకే భూమికి వేర్వేరు రికార్డుల సమస్యకు ఫుల్‌స్టాప్‌ పడనుంది.