రాజేంద్రనగర్‌లో ఎంఐఎం నేత దారుణ హత్య.. అర్ధరాత్రి నడిరోడ్డుపై రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

రాజేంద్రనగర్‌లో ఎంఐఎం నేత దారుణ హత్య.. అర్ధరాత్రి నడిరోడ్డుపై రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

MIM leader brutally murdered in Rajendranagar : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. వ్యక్తిని నడిరోడ్డుపై వెంబడించి రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు కిరాతకులు. పిల్లర్ నెంబర్ 260 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ధీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు స్థానిక ఎంఐఎం పార్టీ నాయకుడు ఖలీల్‌గా గుర్తించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు.. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు ఎక్కడికి వెళ్లారు? ఏం జరిగిందన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. క్లూటీం డాగ్ స్క్వాడ్ తో హత్య జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఖలీల్ కు ఎవరితోనైనా ఏమైనా విభేదాలున్నాయా? ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఖలీల్ కుటుంబ సభ్యుల నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. ఖలీల్ కు ఆర్థికపరమైన అంశాల్లో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? లేదా రాజకీయపరమైన వైరం ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎస్ వోటీ కూడా రంగంలోకి దిగింది.