Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 55వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. ముహూర్తం ఫిక్స్..?

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. పలు ప్రభుత్వ శాఖల్లో ఏకంగా 55వేలకు పైగా కొలువులు భర్తీ చేయనున్నారు.

Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 55వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. ముహూర్తం ఫిక్స్..?

Govt Jobs

Govt Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. పలు ప్రభుత్వ శాఖల్లో ఏకంగా 55వేలకు పైగా కొలువులు భర్తీ చేయనున్నారు. ఖాళీల లెక్క తేలడంతో ప్రభుత్వం నియామకాల ప్రక్రియను చేపట్టనుంది. ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ఏప్రిల్ మూడోవారంలో మొదటి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం(మార్చి 28,2021) సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. మొత్తం ఖాళీలు 55 వేల కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం.

పోలీసుశాఖలో అత్యధిక పోస్టులు:
గతంలో 50 వేలుగా అంచనా వేయగా, తాజాగా పదోన్నతుల అనంతరం మరో 5వేల పోస్టులు తేలాయి. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో 5వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు వచ్చిన లెక్కల మేరకు పోలీసుశాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయి. రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే లెక్క తేలాయి.

ఒకటి, రెండు రోజుల్లో సీఎం సమీక్ష:
‘ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్‌ ఒకటి, రెండు రోజుల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఖాళీలు, భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ నియామకాలపై మంత్రిమండలి ఆమోదం పొంది, ఆయా శాఖలను సన్నద్ధం చేయాల్సి ఉంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టే వీలుంది’ అని అధికారవర్గాలు చెప్పాయి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎందరో నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సో, అభ్యర్థులు టైమ్ వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ ను మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చెయ్యకుండా ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.