Huzurabad : హుజూరాబాద్లో దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది.
Dalit bandhu in Huzurabad : రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు ఉత్తర్వులు జారీ చేశారు.
దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కింద రూ.2000 కోట్లు విడుదల చేయాలని హుజూరాబాబ్ సభ అనంతరం సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. తొలివిడతగా ఇప్పటికే రూ.500 కోట్లను విడుదల చేసింది. హుజూరాబాద్ లో దళితబంధుకు ఇప్పటివరకు రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధుకు మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
వారంలోపు మరో రూ.1000 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.2000 కోట్ల నిధులు పూర్తి స్థాయిలో విడుదల కానున్నాయి. కాగా, ఈ నెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులకు దళితబంధు చెక్కులను అందజేశారు.