ఆ ఎమ్మెల్యే మౌనం వెనుక అసలు రీజన్ ఇదేనా‌?

  • Published By: sreehari ,Published On : September 1, 2020 / 06:49 PM IST
ఆ ఎమ్మెల్యే మౌనం వెనుక అసలు రీజన్ ఇదేనా‌?

ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అజ్మేరా రేఖ నాయక్. ఒక్కరే కాబట్టి పదవులు వస్తాయని ఆశపడడం కామనే. కానీ, ఆమెకు అలాంటి చాన్స్‌ రాలేదు. అందుకే ప్రస్తుతం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మేరా రేఖానాయక్‌ మౌనంగా ఉంటున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

అంతా బాగానే ఉన్నా చురుగ్గా కనబడడం లేదు. అడపాదడపా అధికార కారిక్రమాల్లో దర్శనం ఇస్తున్నారే తప్ప పూర్తిగా జనంలో, అధికార పార్టీ పెద్దలతో కూడా టచ్‌లో ఉండడం లేదని పార్టీలో చెబుతున్నారు.



2009లో రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ తరఫున ఆసిఫాబాద్ జడ్పీటీసీ మెంబర్‌గా పోటీచేసి, విజయం సాధించారు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. 2014లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రితేష్ రాథోడ్‌పై 30 వేల మెజారిటీతో విజయం సాధించారు.



2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్‌ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్‌పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కేసీఆర్‌ మంత్రివర్గంలో రేఖా నాయక్‌కు చోటు లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, చాన్స్‌ దక్కలేదు.

ఈసారైనా ఛాన్స్ దక్కేనా? :
ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే కావటంతో పాటు ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా లేకపోవడంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. గిరిజన శాఖ మంత్రిగా రేఖా నాయక్ అవుతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ అది కాస్త ప్రచారానికి పరిమితం అయిపోవడంతో ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.



మంత్రి పదవి దక్కనందుకే ఆమె మౌనంగా ఉంటున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుంటుందనే వాదనలున్నాయి. భవిష్యత్తులో జరిగే విస్తరణలో చాన్స్‌ ఇస్తారేమో చూడాలి.