AP Elections 2024 : ఏపీలో పోలింగ్.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు!
ఏపీలో పోలింగ్ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Clashes between YCP and TDP Leaders ( Image Credit : Screenshot grab from Video )
AP Elections 2024 : ఏపీలో పోలింగ్ కొనసాగుతున్న ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని తేజశ్రీ, మోర్ల శీనుపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు.
Read Also : CM Revanth Reddy: కొడంగల్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ నాయకులను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పరామర్శించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజక వర్గం లో కుందిర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల నేతలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో టీడీపీ అభ్యర్తికి చెందిన వాహనం అద్దాలు ధ్వంశమయ్యాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఇరువర్గాలు కొట్టుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మధ్య ఘర్ణణ జరిగింది. రాళ్లతో ఇరువర్గాల నేతలు పరస్పరం దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి ముగ్గురికి గాయాలు కాగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also : AP Elections 2024 : ఏపీ పోలింగ్లో ఉద్రిక్తత.. నెల్లూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట!