Whatsapp Governance: ఏపీలో వాట్సప్ గవర్నెన్స్.. అతి సులువుగా ప్రభుత్వం నుంచి ఈ 161 సేవలు అందుకోవచ్చు..
సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పనిచేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నుంచి వాట్సప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభించనుంది. దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించనుంది. మొదటి విడతలో 161 సేవల్ని వాట్సప్ ద్వారా అందించనుంది.
బుధవారం ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద వాట్సప్ గవర్నెన్స్ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. తొలివిడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు వాట్సప్లో అందుతాయి.
సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వేగంగా పౌరసేవలు అందించటం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్ల సేవల్ని అందించాలని నిర్ణయం తీసుకుంది.
రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ శాఖలో ఆస్తిపన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించింది.
ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. రెండో విడతలో మరిన్ని పౌరసేవల్ని అందించాలని నిర్ణయించింది.