Yuvagalam Navasakam : నవశకం సభా వేదికపైకి చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉప్పొంగిన ఉత్సాహం
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై పూలవర్షం కురిపించారు టీడీపీ-జనసేన కార్యకర్తలు, అభిమానులు. జయజయ ధ్వానాల నడుమ అధినేతలకు స్వాగతం పలికారు.

Yuvagalam Navasakam
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. యువగళం-నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేరుకున్నారు.
చంద్రబాబు రాకతో సభా ప్రాంగణం కార్యకర్తల నినాదాలతో హోరెత్తిపోయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. అప్పటికే నారా లోకేశ్ వేదికపై ఉండగా.. చంద్రబాబు, పవన్, బాలకృష్ణల రాకతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పసుపు జెండాల రెపరెపలతో సభా ప్రాంగణమంతా పసుపుమయమైంది.
Also Read : జగన్ ఫోటో ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారు- మంత్రి రోజా
చంద్రబాబు, పవన్ రాకతో బాణాసంచా మోతలు, నినాదాలతో నవశకం ప్రాంగణం మార్మోగిపోయింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై పూలవర్షం కురిపించారు టీడీపీ-జనసేన కార్యకర్తలు, అభిమానులు. జయజయ ధ్వానాల నడుమ అధినేతలకు స్వాగతం పలికారు. బహిరంగ సభ వేదికపైన జనసేన పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.
అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. వేదికపైన చంద్రబాబు పక్కనే పవన్ కల్యాణ్ కూర్చున్నారు. పవన్ కల్యాణ్ పక్కనే నారా లోకేశ్ ఉన్నారు. నవశకం బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన శ్రేణులు తరలివచ్చాయి. టీడీపీ, జనసేన శ్రేణులతో నవశకం ప్రాంగణం నిండిపోయింది. ఇక, పదేళ్ల తర్వాత ఒకే బహిరంగ వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనిపించారు.
Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?