వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీచేయలేవన్న లోకేశ్.. ఏపీలో అందరూ కోరుకున్నట్లే జరిగిందన్న పవన్
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీచేయలేవని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. భారతగడ్డపై మొలిచిన గడ్డిమొక్కను కూడా పీకలేరని చెప్పారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు.
లోకేశ్ మాట్లాడుతూ.. భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉంది. నమో కొట్టే దెబ్బకు పాక్ దిమ్మతిరగడం ఖాయం. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు. రాజధాని కూడా లేకుండానే విడిపోయాం” అని అన్నారు.
“అమరావతి ఇక అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే శరవేగంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ అన్ని విధాలా సహకరిస్తున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం ముందుకెళ్తోంది. చంద్రబాబుపై ద్వేషంతో అమరావతి ని వైసీపీ చంపాలని చూసింది. జై అమరావతి అన్న రైతుల్ని ఎన్ని రకాలుగా వేధించినా తగ్గేది లేదన్నట్లుగా పోరాడారు.
మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే ధైర్యం ఎవరికీ లేదు. ఇతరులు దశాబ్దాలుగా సంకోచించిన కులగణన అంశంపై మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకుని చరిత్రను తిరిగరాశారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే నిబద్ధతకు లోబడి మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు” అని లోకేశ్ చెప్పారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీలో అందరూ కోరుకున్నట్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. చంద్రబాబు దక్షతతో అమరావతి అద్భుత రాజధానిగా మారుతుందని చెప్పారు. ఏపీలో అమరావతి కోసం ఆడపడుచులు ఉద్యమం ఆపలేదని, ఆంధ్ర పౌరుషం చూపించారని కొనియాడారు. అమరావతే శాశ్వత రాజధాని అని మాటిచ్చామని, ఇప్పుడు మోదీ నాయకత్వంలో నిజమవుతోందని పవన్ అన్నారు.