మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలు అరెస్ట్.. మాజీ మంత్రి కుమారుడుసహా మరికొందరిపై కేసు నమోదు..
మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Machilipatnam
Andhrapradesh: మచిలీపట్నంలో ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత మచిలీపట్నం పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి.
హోం మినిస్టర్ వంగలపూడి అనిత పర్యటనలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని వైసీపీ నేతలపై టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 19 మంది వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద ఇనగుదురుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. 19మందిలో ఏడుగురిని అరెస్టు చేశారు. కేసు నమోదైన వారిలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా ఉన్నాడు. అతన్ని ఏ19గా పోలీసులు చేర్చారు.
మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతితోపాటు మహిళా కార్పొరేటర్లు వాణి కుసుమ, బందెల కవితలపై కూడా కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిలో మేకల సుబ్బన్న, గూడవల్లి నాగరాజు, నోబుల్ థామస్, కొలుసు హరిబాబు, తుమ్మలపల్లి జగన్నాధరావు, బాబావలీ, తిరులమలశెట్టి వర ప్రసాద్ ఉన్నారు. ఈ ఘటనతో మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.ఈ అరెస్టులు స్థానికంగా వివాదాస్పదంగా మారాయి. వైసీపీ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.