ఏపీలో కొత్త ఏడాదిలో కొత్త జిల్లాలు.. ప్రభుత్వం కసరత్తు

Re-organisation of districts in Andhra Pradesh : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాల పునర్విభజనపై అధికారులతో సోమవారం (నవంబర్ 16) సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ నీలంసాహ్ని, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
గతంలో సీఎస్ నీలం సాహ్ని నేతృత్వంలోని కమిటీకి తోడు నాలుగు సబ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే సీఎస్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసింది. జిల్లాల పునర్విభజనపై కమిటీ అధ్యయనం దాదాపు పూర్తి అయినట్టే కనిపిస్తోంది.
https://10tv.in/ap-government-speed-up-process-of-new-districts-formation/
జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ.. నిర్మాణాత్మకత, సిబ్బంది, పునర్విభజన అధ్యయనానికి రెండవ సబ్ కమిటీ.. మౌలిక సదుపాయాల అధ్యయనం, ఆస్తుల అధ్యయనానికి మూడవ సబ్ కమిటీ.. ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి నాలుగవ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సంక్రాంతి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. పునర్ వ్యవస్థీకరణలో తలెత్తుతున్న సమస్యలు, డిమాండ్లపై సీఎంకు వివరించే అవకాశం ఉంది.
పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో సమకూర్చాల్సిన నిధులు, అధికారిక పోస్టులపై అధికారులు సీఎంకు నివేదించనున్నారు. కమిటి సిఫార్సులను సీఎం జగన్ పరిశీలించనున్నారు.