పిచ్చోడు : ప్రియురాలి కోసం దొంగగా మారాడు

ప్రియురాలి మోజులో పడ్డాడు. విలాసాలకు అలవాటయ్యాడు. వ్యసనాలతో సావాసం చేశాడు. అటు లవర్ని ఇంప్రెస్ చేయాలి.. ఇటు డాబుగా బతకాలి. అంతే ఒకటే ఆలోచన. చోరీలకు పాల్పడటమే తన మార్గంగా మార్చుకొని దొంగగా మారాడు. హైదరాబాద్ సుల్తాన్ బజార్కు చెందిన బల్వీర్సింగ్.. డిగ్రీ వరకు చదువుకున్నాడు. నగరంలోని కాచిగూడ ప్రాంతంలో అతని కుటుంబానికి భవనాలు ఉన్నాయి. వాటి అద్దె రూపంలోనే నెలకు 3 లక్షల రూపాయలు వస్తుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన బల్వీర్.. బెంగళూర్లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్న ప్రియురాలి కోసం దొంగగా మారాడు. ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్లు కొనిచ్చేందుకు, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు చోరీలకు పాల్పడ్డాడు.
ఎస్సార్నగర్ ప్రాంతంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. బల్కంపేటలో జరిగిన చోరీ కేసులో విచారణ జరిపిన పోలీసులు.. బల్వీర్సింగ్ను అరెస్ట్ చేశారు. అతని నుంచి అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై ఇంతకుముందు కూడా పలు కేసులున్నట్టు.. పీడీ యాక్ట్లో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు జీవితాన్ని వక్రమార్గం పట్టించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.