టిఫిన్ తినకపోతే.. పరీక్షల్లో మార్కులు తగ్గుతాయి!

పిల్లలు టిఫిన్ చేయకుండానే స్కూల్కు వెళ్తున్నారా? అయితే పరీక్షల్లో వారి మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. బ్రిటన్ లోని కొందరు ప్రైమరీ పాఠశాల విద్యార్థులపై లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
పిల్లలకు తగినన్ని పోషకాలు లేకపోవడం వల్ల వారి మార్కులపై ప్రభావం పడుతుందని తాము గుర్తించామని శాస్త్రవేత్త కేటీ అడోల్ఫస్ తెలిపారు. పరిగణనలోకి తీసుకున్న విద్యార్థులందరి గ్రేడ్స్ను పాయింట్ల రూపంలోకి మార్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే వారికి ఎక్కువ పాయింట్లు రాగా, మిగిలిన వారికి తక్కువ వచ్చాయి.
వెస్ట్ యార్క్షైర్లోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన 294 మంది విద్యార్థులపై పరిశోధకులు సర్వే చేశారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులతోపాటు, వయసు, ఆడ? మగ? వంటి ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా ఫలితాల్లో మార్పేమీ లేదని వివరించారు. అందుకే స్కూల్ లేదా కాలేజికి వెళ్లే పిల్లలకు కచ్చితంగా టిఫిన్ తినిపించే పంపించాలి.