నిత్యావసరాలకు కుటుంబంలో ఒకరికే పాసు, కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల కోసం కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే పాస్ లు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులు ఆదేశించారు. శనివారం(మే 2,2020) కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డిప్యూటీ సీఎం ఆళ్లనాని, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్-19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు.
* ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని సీఎం ఆదేశం
* ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలి
* వారికి కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం
* కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలి
* అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్-19 క్వారంటైన్ చర్యలు చేపట్టాలని ఆదేశం
* కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశం
* ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలి
* కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలన్న సీఎం
* డాక్టర్, ఏఎన్ఎం, ఆశాకార్యకర్త, మందులు కూడా మొబైల్ యూనిట్కు అందుబాటులో ఉంచాలన్న సీఎం
లాక్డౌన్ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై సమీక్ష:
కేంద్రహోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్మెంట్ జోన్లు ఉండాలి అన్నదాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలు తయారుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అనుమతులు ఉన్న దుకాణాల దగ్గర పాటించాల్సిన ఎస్ఓపీలను ఇవ్వాలన్నారు.
* రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పరీక్షలు 1,08,403
* నిన్న(మే 2,2020) 5,943 పరీక్షలు
* ప్రతి 10 లక్షలకు 2030 మందికి పరీక్షలు
* పాజిటివిటీ కేసుల రేటు 1.41 శాతం.. దేశవ్యాప్తంగా 3.82శాతం
* రాష్ట్రంలో మరణాల శాతం 2.16శాతం, దేశవ్యాప్తంగా 3.28శాతం
క్వారంటైన్లలో సదుపాయాలపై రోగుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారా? లేదా? అని సీఎం ఆరా తీశారు. సమస్యలపై ఎలాంటి చర్యలు తెలుసుకుంటారన్నదానిపై తనకు తెలియజేయాలన్నారు. మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు సీఎంకి చెప్పారు. ఈలోగా మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధివిధానాలు ఖరారు చేయాలన్నారు.
* జూన్ 6న మత్స్యకార భరోసాకు సిద్ధం అయ్యామన్న అధికారులు
* రైతు భరోసాకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని, ఎవరైనా పేరు లేకపోతే దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నామని వెల్లడించిన అధికారులు
* ప్రతి పంటలోనూ ప్రభుత్వం తరఫున ఎంత కొనుగోలు చేయాల్సి ఉంటుంది, ఆ మేరకు రోజువారీగా సేకరణ ఎంతచేయాలి? చేస్తున్నారా? లేదా? అన్నదానిపై వివరాలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం
* ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తేమ కొలిచే సాధనాలను అందుబాటులో ఉంచాలని, వీటిని ప్రతి రైతు భరోసా కేంద్రం దగ్గర ఉంచాలని సీఎం ఆదేశం.
Also Read | గుంటూరు, కృష్ణాలో భారీగా కరోనా కేసులు, రెండు జిల్లాల మధ్య రాకపోకలు బంద్