AP Cinema Ticket Prices : ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు.. కొత్త జీవో జారీ
AP Cinema Ticket Prices : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది.
AP Cinema Ticket Prices : ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఏపీలో ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చిన్నసినిమాలకు ఐదో షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒక్కో థియేటర్లో రెండు రకాల టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.20 నుంచి గరిష్టంగా రూ. 250 వరకు నిర్ధారించింది ప్రభుత్వం. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రీమియం, నాన్ ప్రీమియంగా ధరలను నిర్ధారించింది. ఈ రేట్లకు జీఎస్టీ అదనమని వెల్లడించింది. హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కనీసం 10 రోజుల వరకు సినిమా టికెట్లపై రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ కొత్త జీవో ప్రకారం.. సినిమా టికెట్ల ధరలు కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100గా ఉండనున్నాయి. అదేవిధంగా నాన్ ఏసీలో టికెట్ల ధరలు రూ.40, రూ. 60గా ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ. 100, రూ.125గా నిర్ణయించింది. కార్పొరేషన్ మల్టీప్లెక్స్ల్లో టికెట్ ధర రూ.150, రూ.250గా నిర్ణయించింది. మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో టికెట్ల ధరలు రూ.30, రూ.50లుగా ఉండనున్నాయి.
మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ. 100గా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధరలు రూ.125, రూ.250గా నిర్ణయించింది. నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70గా నిర్ణయించింది. నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.20 నుంచి రూ. 40 వరకు ఉండనున్నాయి. నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90గా ఉండనున్నాయి. నగర పంచాయతీల్లో మల్టిపెక్స్ ల్లో టికెట్ ధర రూ.100 నుంచి రూ. 250 వరకు నిర్ణయించింది. కొత్త జీవో జారీతో గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 35 రద్దు అయినట్టు ప్రభుత్వం తెలిపింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్, మంత్రి పేర్నినాని, అధికారులు, కమిటీకి చిత్ర పరిశ్రమ తరుఫున చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. పాన్ ఇండియా స్టార్ కూడా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు.. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి సినీ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వానికి మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరిగాయి. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవితో సహా సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, పోసాని కృష్ణమురళి తదితరులు సీఎం జగన్ తో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యలపై సీఎంతో చర్చించిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల అభ్యర్థనతో సీఎం జగన్ ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై కొత్త జీవో జారీ చేస్తామని తెలిపారు.
Read Also : సినిమా టికెట్ల ధరలపై ముగిసిన కమిటీ సమావేశం