దేశంలో గత 24 గంటల్లో 1,718 కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,718 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కు చేరింది. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని, గత 24 గంటల్లో 630 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.
దేశంలో కరోనా రికవరీ రేటు 25 శాతం పైగానే ఉందన్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8,324 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల్లో 78 శాతం మందికి ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే పరీక్షలు చేయాలని, లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామని చెప్పారు. లాక్డౌన్లో వలస కూలీలకు ఆహారం అందిస్తున్నామని, భౌతిక దూరం పాటించడంలో ప్రజలు చాలావరకు అవగాహనకు వచ్చారని తెలిపారు. కరోనా ప్రభావం లేని చోట ఇప్పటికే చాలా సడలింపులు ఇచ్చామని వెల్లడించారు. కొన్ని రాష్ర్టాల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన చెప్పారు.