AAP: ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను తొలగించేందుకు ఇతర విపక్ష పార్టీలతో చర్చలు జరుపుతాం: ఆప్ వర్గాలు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో రెండు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇండియా కూటమిలో మళ్లీ విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను తొలగించేందుకు కూటమిలోని ఇతర పార్టీలను సంప్రదిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్పాయి.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమలులో లేని సంక్షేమ పథకాల పేర్లను చెబుతూ ప్రజలను ఆప్ తప్పుదోవ పట్టిస్తోందని, మోసగించారని కాంగ్రెస్ ఆరోపిస్తుండడంతో ఆ పార్టీపై ఆప్ అసంతృప్తితో ఉన్నట్లు జాతీయ మీడియాకు ఆప్ వర్గాలు తెలిపాయి.
ఆప్ను లక్ష్యంగా చేసుకుని అజయ్ మాకెన్తో పాటు ఇతర ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై తమ పార్టీ ఆగ్రహంగా ఉందని చెప్పాయి. ఢిల్లీలో మహిళా సమ్మాన్ యోజనతో పాటు సంజీవని యోజనను ప్రభుత్వం నోటిఫై చేయలేదని ఢిల్లీ యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం సరికాదని ఆప్ అంటోంది.
ఓటర్లను ఆకర్షించేందుకు ఆప్ తప్పుడు, మోసపూరిత హామీలను ఇస్తోందని యూత్ కాంగ్రెస్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఆప్ ఎమ్మెల్యేలు, ఎంసీడీ కౌన్సిలర్లు సహా ఆప్ నాయకులు ఓటీపీ ధ్రువీకరణ అవసరమయ్యే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ఓటర్ ఐడీ వివరాలు, ఫోన్ నంబర్ల వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది.
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెబుతున్నవన్నీ అసత్యాలే: వైఎస్ షర్మిల