Bharath Bandh: భారత్‌ బంద్‌లో.. దేశ వ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసా?

పంజాబ్‌లో ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశారు. సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా..

Bharath Bandh: భారత్‌ బంద్‌లో.. దేశ వ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసా?

Bharath Bandh

దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉద్రిక్తతల మధ్యే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ రహదారుల ముట్టడితో పాటు రైల్‌ రోకోలు, టోల్‌ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టారు. పంజాబ్‌లోని శంభు బోర్డర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పంజాబ్‌లో ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశారు.

సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా రోడ్లపైనే ఉంటున్న రైతులు.. శక్రవారం తెల్లవారు జామునే మరోసారి నిరసనలకు సిద్ధమయ్యారు. రోడ్లపైనే టీలు, టిఫిన్లు చేసి.. 6 గంటల నుంచి నిరసనలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్‌ మోర్చాతో పాటు కార్మిక సంఘాల బంద్‌లో రైతులు, కార్మికులు, మహిళలతో పాటు పలు వర్గాలు పాల్గొన్నాయి.

బంద్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధించారు రైతులు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని ప్రధాన రహదారుల్లో టోల్ ప్లాజాల వద్ద రైతులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రాకపోకలు జరగకుండా రహదారులు మొత్తం స్తంభింపజేశారు. మరోవైపు బంద్‌ కారణంగా పంజాబ్‌లో బస్సులు మొత్తం బస్టాప్‌లకే పరిమితమయ్యాయి. సుమారు 3 వేల ప్రభుత్వ బస్సుల రాకపోకలను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రైల్‌రోకో..
మరోవైపు.. పంజాబ్‌లోని చాలా చోట్ల రైతులు రైల్‌రోకో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు. అయితే.. రైతుల ఉద్యమం కారణంగా ఇప్పటికే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేసిన రైల్వే శాఖ.. లూథియానా- సాహ్నేవాల్- చండీగఢ్ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన ఆందోళనలో రైతు ఉద్యమ నేత రాకేశ్‌ టికాయత్‌ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారాయన.

ఇక.. హర్యానాలోని శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్‌ సందర్భంగా వందల మంది రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఈ క్రమంలో రైతులను నిలువరించేందుకు పోలీసులు.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురు రైతులు గాయపడ్డారు. మరోవైపు.. అంబాలా సమీపంలో ఆందోళన చేస్తున్న జ్ఞాన్‌ సింగ్‌ అనే 65 ఏళ్ల రైతు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
మరోవైపు రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 30 వేల టియర్‌ గ్యాస్‌ సెల్‌లు సిద్ధం చేసుకున్న పోలీసులు.. వేలమందితో భదత్రా చర్యలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఇక రైతులు ఇచ్చిన బంద్‌కు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులు మద్దతు ప్రకటించారు. సాయంత్రం 4 గంటల వరకు రైతు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి.

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో ఆదివారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అయితే… తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించబోమని రైతులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో రైతు, కార్మిక సంఘాలు ఆందోళన తెలిపాయి.