త్రివిధ దళాలకు అత్యవసర నిధులు విడుదల..సరిహద్దుల్లో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ
చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం నడుమ ఏ పరిస్థితులకైనా సిద్ధమవుతున్న కేంద్రం…రక్షణ దళాలకు 500కోట్ల అత్యవసర నిధులను విడుదల చేసింది. ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేయడానికి కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది.
త్రివిధ దళాలకు అత్యవసర అవసరాల విధానంలో భాగంగా ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం త్రివిధ దళాలకు ఆర్థిక అధికారాలను మంజూరు చేసింది. ఇప్పుడు వారు ఈ అధికారాల క్రింద కొత్త ఆయుధాలను కొనుగోలు చేయవచ్చు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి
ఈ ప్రాజెక్ట్ కింద, రక్షణ దళాలు, సైనిక వ్యవహారాల శాఖతో సంప్రదించి, యుద్ధానికి అవసరమవుతాయని లేదా వారి జాబితాలో తక్కువ అని భావించే ఏదైనా ఆయుధాన్ని కొనుగోలు చేయడానికి వెళ్ళవచ్చు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్రివిధ దళాలు ఇప్పటికే సాధ్యమైనంత తక్కువ సమయంలో సేకరించగలిగేలా తమకు అవసరమైన ఆయుధాలు మరియు పరికరాల జాబితాను తయారు చేయడం ప్రారంభించాయి.
తూర్పు లడఖ్ లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు. చైనా సరిహద్దుల్లో ఆర్మీకి ఫ్రీహ్యాండ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే జల, వాయు మార్గాల ద్వారా చైనా ప్రవేశించే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. సరిహద్దులో చైనా సైనికులు ఎటువంటి దాడులకు ప్రయత్నించినా ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించారు.
మరోవైపు, తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో సోమవారం నాటి ఘటనతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్’లో భారత్ కీలక మార్పులు చేసింది. దీంతో అసాధారణ పరిస్థితుల్లో సైనికులు కాల్పులు జరిపే విధంగా కమాండర్లు వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వొచ్చు. ఇందుకోసం అన్ని వనరులను ఉపయోగించుకోవచ్చు. తుపాకులను వాడొచ్చు. గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనాతో జరిగిన భీకర పోరులో 20మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.