ఆగ్రహంతో ఊగిపోతూ పెళ్లి కూతురి బంధువులపైకి కారు ఎక్కించిన యువకుడు.. తొమ్మిది మందికి గాయాలు
పెళ్లి వేడుకకు వచ్చిన యువకుడు.. వివాహ వేదిక వెలుపల బాణసంచా పేలుస్తున్నాడు.

Crime
Crime News: రాజస్థాన్లో ఓ వివాహ వేడుకలో ఓ యువకుడు దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన కారుతో తొమ్మిది మందిపైకి దూసుకెళ్లాడు. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్లోని దౌసా జిల్లా, లడ్పూరా గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. లడ్పూరాలో పెళ్లి వేడుకకు వచ్చిన యువకుడు.. వివాహ వేదిక వెలుపల బాణసంచా పేలుస్తున్నాడు. అదే సమయంలో వధువు సోదరుడితో అతడికి గొడవ మొదలైంది. పెళ్లికూతురి బంధువులతో ఆ యువకుడు వాగ్వాదానికి దిగాడు.
అనంతరం ఆగ్రహంతో ఊగిపోతూ కారులో కూర్చొని ఆ వాహనంతో పెళ్లికూతురు బంధువులపైకి దూసుకెళ్లాడు. దీంతో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికులు జైపూర్లోని ఎస్ఎమ్ఎస్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఈ ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.