Sonia Gandhi: వ్యవస్థ కాదు.. ప్రజలను ఫెయిల్ చేసింది మోడీ ప్రభుత్వమే
మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమైంది వ్యవస్థలు కాదు. మోడీ ప్రభుత్వమే అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. దేశ బలాలు, వనరులను ప్రభుత్వం నిర్మాణాత్మకంగా..

sonia-modi
Sonia Gandhi: ఇండియాలో విజృంభిస్తోన్న కరోనా.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని దానిని ఎదుర్కోవడంలో వ్యవస్థ కాదని, మోడీ ప్రభుత్వమే ఫెయిల్ అయినట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. శుక్రవారం సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం వర్చువల్ వేదికగా మాట్లాడారు.
‘కరోనాపై జరుగుతున్న పోరు రాజకీయ విభేదాలకు అతీతమైంది. మనమంతా కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాలి. ఇందులో భాగంగా, మొట్టమొదటగా మోడీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించాలి’ అని పేర్కొన్నారు.
‘మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమైంది వ్యవస్థలు కాదు. మోడీ ప్రభుత్వమే అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. దేశ బలాలు, వనరులను ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వినియోగించుకోలేకపోయింది. ప్రజల పట్ల ఏమాత్రం సానుభూతి లేని దేశ రాజకీయ నాయకత్వంతో యావత్తూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది’అని మండిపడ్డారు.
‘సమయం ఇంకా మించిపోలేదు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సామర్థ్యం, దృఢచిత్తం, దూరదృష్టిగల నాయకత్వం అవసరం’అని సోనియా పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత కారణంగా దేశం కష్టాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు.
ప్రజలకు సేవ చేసేందుకు ఎంపీలంతా అంకితం కావాలని పిలుపునిచ్చారు. మహమ్మారిని కలిసికట్టుగా, జవాబుదారీతనంతో ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు స్టాండింగ్ కమిటీలు సమావేశం కావాలన్నారు.
ఇటీవల కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, తరుణ్ గొగోయ్ సహా మాజీ పార్లమెంటు సభ్యులకు నివాళి అర్పించిన అనంతరం సమావేశం ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.