వయనాడ్లో రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ వ్యూహాలు
ట్రయాంగిల్ ఫైట్లో రాహుల్ను ఓడించాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ. సురేంద్రన్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు.. ఆయనకు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పేరుంది.
Wayanad Lok Sabha constituency: రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది బీజేపీ. కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్పై అస్త్రశస్త్రలు ఉపయోగించేందుకు రెడీ అయింది. గత ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసి వయనాడ్లో మాత్రమే గెలిచారు రాహుల్. దీంతో ఈసారి అమేథీని వదిలేసి వయనాడ్ బరిలో మాత్రమే ఉన్నారాయన. వయనాడ్లో రాహుల్కు పోటీగా కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ను బరిలోకి దింగడంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కేరళలో వయనాడ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన 24 గంటల తర్వాత బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, సీపీఐ అభ్యర్థిగా డి.రాజా భార్య అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ను అభ్యర్థిగా బరిలోకి దిగారు.
రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కూడా అట్టహాసంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. సురేంద్రన్ నామినేషన్ ర్యాలీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు.
వయనాడ్ ర్యాలీలో రాహుల్ను టార్గెట్ చేశారు స్మృతి ఇరానీ. గాంధీ కుటుంబం 50 ఏళ్లు పాలించిన ప్రాంతం నుంచి వచ్చానంటూ ప్రసంగించారు. పీఎఫ్ఐ వంటి నిషేధిత సంస్థల నుంచి రాహుల్ గాంధీ సహాయం తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు స్మృతి ఇరానీ.
Also Read: కచ్చతీవు ద్వీపం ఎక్కడుంది.. ఎందుకు వివాదానికి కారణమైంది.. దీని స్టోరీ ఏంటీ?
మరోవైపు వయనాడ్లో హైవోల్డేజ్ ప్రచారానికి ప్లాన్ చేస్తోంది బీజేపీ. నామినేషన్ల కార్యక్రమం అయిపోవడంతో బీజేపీ అగ్రనేతలతో క్యాంపెయిన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రయాంగిల్ ఫైట్లో రాహుల్ను ఓడించాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంది బీజేపీ. సురేంద్రన్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే కాదు.. ఆయనకు ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పేరుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కోసం 15 ఏళ్లు పోరాడారు సురేంద్రన్.
Also Read: ఆప్ అగ్రనాయకత్వమంతా తీహార్ జైలులోనే.. ఈ నలుగురు వెళ్లింది అవినీతి కేసుల్లోనే..
బీజేపీ సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తుంటే.. సిట్టింగ్ సీటులో మళ్లీ గెలిచి పరువు నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు రాహుల్. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 64శాతం ఓట్లు సాధించారు. ఈసారి ఆయనకు అంతకు మించి మెజార్టీ వస్తుందని అంచనా వేస్తోంది కాంగ్రెస్.