టెన్త్.. కొత్త ఎగ్జామ్ సెంటర్లపై మెసేజ్‌లు

  • Published By: srihari ,Published On : May 26, 2020 / 01:14 AM IST
టెన్త్.. కొత్త ఎగ్జామ్ సెంటర్లపై మెసేజ్‌లు

Updated On : May 26, 2020 / 1:14 AM IST

పదో తరగతి పరీక్షల ముందు రోజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాత పరీక్ష కేంద్రానికి వెళ్లి వివరాలను చూసుకోవాలి. లేదంటే పరీక్ష ప్రారంభం రోజున ఎగ్జామ్ సెంటర్ కోసం వెతికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. పాత కేంద్రాల్లో హాల్‌టికెట్‌ నంబర్‌, హాల్‌టికెట్‌ నంబర్‌ మధ్య ఏ సెంటర్లో ఉందో తెలుసుకోవచ్చు. మిగతా వారికి సమీపంలోని ఏ భవనంలో అదనంగా కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేశారో వివరాలు తెలుసుకోవచ్చు. జూన్‌ 7వ తేదీన పాత కేంద్రాల వద్ద నోటీసు బోర్డుల్లో కొత్త కేంద్రాల వివరాలను అందుబాటులో ఉంచుతామని  ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి చెప్పారు. 

గంట ముందే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామన్నారు. విద్యార్థులు అదే రోజు వెళ్లినా సమీపంలోని కొత్త కేంద్రం వివరాలు పొందవచ్చు. పాత కేంద్రం నుంచి కొత్త కేంద్రానికి వెళ్లే క్రమంలో మొదటిరోజు కొద్దిగా ఆలస్యమైనా అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థుల ప్రత్యక్ష తనిఖీ ఉండదని, పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్క్‌లు అందజేస్తామన్నారు. విద్యార్థులూ వాటిని తెచ్చుకోవచ్చునని చెప్పారు. మంచినీళ్ల బాటిళ్లను కూడా అనుమతిస్తామని, పరీక్ష కేంద్రాలన్నింటినీ కెమికల్‌తో శానిటైజ్‌ చేస్తామని చెప్పారు. 

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే 5,34,903 మంది విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు పక్కా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులు ఏ దశలోనూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పాత కేంద్రాలు 2,530 ఉండగా మరో 2,005 కేంద్రాలను గుర్తించామన్నారు. అవసరమైతే ఇంకా కేంద్రాలను పెంచాలని డీఈవోలను ఆదేశించినట్టు తెలిపారు. 

స్కూళ్లల్లోని అదనపు గదులు, కాలేజీల భవనాలు, ఫంక్షన్‌ హాళ్లు, ఆడిటోరియాలను తీసుకొని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రతి 20 స్కూళ్లకు కలిపి ఒక జోన్‌గా చేశామని, అందులో నాలుగు సెంటర్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు కూడా ఆయా జోన్లలో వాటికి సమీపంలోని భవనాల్లోనే అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అక్కడే ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షలకు వచ్చే వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటివి ఉంటే వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. 

Read: టిక్ టాక్.. కుటుంబాన్ని కలిపింది