Asia Cup 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది.

Courtesy : @BCCI
Asia Cup 2025: ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తుగా ఓడించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా చేజ్ చేసింది భారత్. 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ స్కోరర్. 37 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ 31 పరుగులతో రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ చేశాడు. 13 బంతుల్లోనే 31 రన్స్ చేశాడు. 2 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. పాక్ బ్యాటర్లను వణికించారు. మన పేసర్లు, స్పిన్నర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. రెగులర్ ఇంటర్వెల్స్ పాక్ వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. బుమ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్లు పడగొట్టారు. పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ టాప్ స్కోరర్. 44 బంతుల్లో 40 పరుగులు చేశాడు. షాహీన్ అఫ్రిదీ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఏకంగా 4 సిక్సులు బాదాడు. ఇద్దరు డకౌట్ అయ్యారు. అయూబ్, మహమ్మద్ నవాజ్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు.
స్కోర్లు..
పాకిస్తాన్ – 20 ఓవర్లలో 127/9
భారత్ – 15.5 ఓవర్లలో 131/3