టీమిండియా ఆటతీరులో హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ ఎందుకు మార్పు తీసుకురాలేకపోతున్నారు?

ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఓడిపోతే ఆయన సమర్థతపై మరిన్ని ప్రశ్నలు రావచ్చు.

టీమిండియా ఆటతీరులో హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ ఎందుకు మార్పు తీసుకురాలేకపోతున్నారు?

Updated On : January 1, 2025 / 8:14 PM IST

టీమిండియా ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో అంతగా రాణించడం లేదు. దానికితోడు ప్రస్తుతం జరుగుతోన్న 5 మ్యాచుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో మ్యాచు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఫైనల్‌ మ్యాచ్ సిడ్నీలో శుక్రవారం ప్రారంభం అవుతుంది.

ఇప్పటికే ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఆ మ్యాచులో టీమిండియా గెలవకపోయినా, డ్రా అయినా సిరీస్‌ను కోల్పోతాం. దీంతో టీమిండియా ఆటతీరులో మార్పు తీసుకురావడంలో హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌, ఆయన సిబ్బంది పాత్రపై అందరి దృష్టి పడింది.

ఆన్ ఫీల్డ్‌లోని సమస్యలే కాదు ఆఫ్‌ ఫీల్డ్‌లోనూ సమస్యలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీమిండియా కోచ్‌లుగా రాహుల్ ద్రవిడ్‌, రవిశాస్త్రి ఉన్న సమయంలో జట్టు ఆటగాళ్లతో వారికి మంచి కమ్యూనికేషన్‌ ఉండేది. ఇప్పుడు గౌతం గంభీర్‌, జట్టు ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్‌ సరిగ్గా ఉండడం లేదని ప్రచారం జరుగుతోంది.

జట్టులోని మెజారిటీ ఆటగాళ్లతో గంభీర్ చాలా విషయాల్లో ఏకీభవించడం లేదని తెలుస్తోంది. భారత జట్టు సభ్యుల నమ్మకాన్ని గౌతం గంబీర్‌ చూరగొనడం లేదని సమాచారం. “ఇంకా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాలి, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. మంచి ప్రదర్శన మెరుగుపడకపోతే, గౌతమ్ గంభీర్ స్థానం (హెడ్‌ కోచ్‌గా) కూడా సురక్షితం ఉండదు” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాతో అన్నారు.

అంతేకాదు, సెలెక్టింగ్‌ కమిటీతో గౌతం గంభీర్‌కు ఉన్న సంబంధాలపై కూడా అనుమానాలు ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ 0-3 తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో ఇప్పటికే హెడ్‌ కోచ్‌గా గంభీర్ సమర్థతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఓడిపోతే ఆయన సమర్థతపై మరిన్ని ప్రశ్నలు రావచ్చు.

అమెరికాలో ఘోరం.. జనాలపైకి ట్రక్కును ఎక్కించిన డ్రైవర్‌.. 10 మంది మృతి.. 30 మందికి గాయాలు