IPL auction 2022: రిటైన్ కాని 8మంది భారతీయ ఆటగాళ్ల కోసం భారీ పోటీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 కోసం వేలం పాట ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు.

Suresh Raina
IPL auction 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 కోసం వేలం పాట ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈసారి వేలంలో చాలా మంది ఆటగాళ్లు జట్లు మారబోతున్నారు. దీంతో పాటు పలువురు ఆటగాళ్లకు కనక వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. IPL 2022కి ముందు, జట్లు కొంత మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. కొంతమందిని నిలుపుకోలేదు. అందులో టాప్ 8 భారత ఆటగాళ్లను మళ్లీ భారీ ధరకు కొనుక్కునే అవకాశం కనిపిస్తోంది.
సురేష్ రైనా:
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చాలా కాలం పాటు ఆడిన వెటరన్ బ్యాట్స్మెన్ సురేష్ రైనాను ఫ్రాంచైజీ ఈసారి అట్టిపెట్టుకోలేదు. అయితే, రైనాను చెన్నై మళ్లీ వేలంలో దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. రైనా బేస్ ధర రూ.2 కోట్లు కాగా.. ఐపీఎల్ 176 మ్యాచ్లు ఆడి 4687 పరుగులు చేశాడు రైనా. ఈ టోర్నీలో అతని అత్యుత్తమ స్కోరు 100 నాటౌట్.
శిఖర్ ధావన్:
శిఖర్ ధావన్ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. ధావన్ 63 మ్యాచ్ల్లో 2066 పరుగులు చేసి మంచి యావరేజ్తో ఉన్నాడు. శిఖర్ బేస్ ధర కూడా రూ.2 కోట్లు కాగా.. టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు ధావన్ కోసం కచ్చితంగా వేలంలో పోటీ ఉండవచ్చు.
శ్రేయాస్ అయ్యర్:
శ్రేయాస్ అయ్యర్ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. కొంతకాలం ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ వేలంలోకి వచ్చాడు. ఈ యంగ్ ప్లేయర్ కోసం కూడా జట్లు పోటీ పడవచ్చు.
శుభమాన్ గిల్:
శుభమాన్ గిల్ను కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేయలేదు. అయితే వేలానికి ముందే అతడిని గుజరాత్ టైటాన్స్ తీసేసుకుంది.
కృనాల్ పాండ్యా:
కృనాల్ పాండ్యా కూడా ఈసారి వేలంలో ఉన్నాడు. అతని కోసం ముంబై ఇండియన్స్ మళ్లీ పోటీ పడవచ్చు. కృనాల్ 84 మ్యాచ్ల్లో 1143 పరుగుల చేసి 51 వికెట్లు తీశాడు.
హార్దిక్ పాండ్యా:
హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు ముంబై ఇండియన్స్లో భాగంగా ఉన్నాడు. కానీ ఈ సీజన్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అతనిని దక్కించుకుని కెప్టెన్గా చేసింది.
ఇషాన్ కిషన్:
ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు. యువ ప్రతిభావంతుడైన బ్యాట్స్మెన్ ఇషాన్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ ముంబై అతడిని వెనక్కి తీసుకోలేదు. ఇషాన్ బేస్ ధర రూ.2 కోట్లు.
యుజ్వేంద్ర చాహల్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎన్నో విజయాల్లో కీలకంగా వ్యవహరించిన యుజ్వేంద్ర చాహల్ను రిటైన్ చేయలేదు ఆ జట్టు. చాహల్ 113 మ్యాచ్ల్లో 139 వికెట్లు తీశాడు. అతని బేస్ ధర రూ.2 కోట్లుగా ఉంది.