Sourav Ganguly : గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. కోహ్లి 40 బంతులు ఆడితే.. ఓపెనర్గా మాత్రం..
ఐపీఎల్ 17వ సీజన్ ముగిసిన వారం వ్యవధిలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
Sourav Ganguly – Virat Kohli : ఐపీఎల్ 17వ సీజన్ ముగిసిన వారం వ్యవధిలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా.. ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగనుందో అనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంలో ఎవరెవరు ఉంటారు అన్న దాని పై ఊహాగానాలు మొదలయ్యాయి.
రోహిత్ శర్మ సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఆడనుందని ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎలాగూ రోహిత్ శర్మ ఓపెనర్గా వస్తాడు. అతడికి తోడుగా మరో ఓపెనర్ గా ఎవరు వస్తే బాగుంటు అన్న ప్రశ్నకు బీసీసీఐ మాజీ అధ్యక్షడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలని సూచించాడు.
Yashasvi Jaiswal : టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన జైస్వాల్..
40 బంతుల్లోనే శతకం చేయగల సత్తా కోహ్లికి ఉందని గంగూలీ అభిప్రాయ పడ్డాడు. అదే సమయంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రేసులో ఉన్నాడనే విషయాన్ని మరిచిపోవద్దన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో నిరాశపరిచిన జైస్వాల్ నెమ్మదిగా ఫామ్ అందుకుంటున్నాడు. సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో అతడు సెంచరీ చేశాడు.
భయం లేకుండా ఆడాలి..
టీ20 ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకోవాలంటే ఎలాంటి భయం లేకుండా ఆడాలని గంగూలీ అన్నాడు. హిట్టింగ్ ఆడడమే పనిగా పెట్టుకోవాలన్నాడు. మనకు రోహిత్, విరాట్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య లతో పాటు ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. అవలీలగా బౌండరీలు కొట్టగల సారథ్యం వారి సొంతమన్నాడు. ఏదీ ఏమైనప్పటికీ అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతోనే భారత జట్టు ప్రపంచకప్ బరిలోకి దిగాలని సూచించాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. జూన్ 1న అమెరికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్తో టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ఆరంభం కానుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది. ఇందుకు న్యూయార్క్ వేదిక కానుంది.