Asia Cup 2022: భారీ విజయంపై టీమిండియా గురి.. నేడు భారత్, హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్..
ఆసియా కప్-2022లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాక్ తో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని దక్కించుకొని టీమిండియా మంచి ఊపుమీదుంది.. ఈ క్రమంలో ఇవాళ పసికూన హాంకాంగ్తో జరిగే మ్యాచ్ లో భారత్ భారీ విజయంపై కన్నేసింది.

India vs hong kong
Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం విధితమే. గెలుపు ఉత్సాహంతో టోర్నీలో అత్యంత బలహీనమైన జట్టు, క్వాలిఫయర్స్ ద్వారా ఆసియా కప్ కు అర్హత సాధించిన హాంకాంగ్ ను రోహిత్ సేన నేడు ఢీకోబోతుంది. ఈ క్రమంలో భారీ విజయంపై టీమిండియా గురిపెట్టింది.
గ్రూప్-ఏలో పాక్పై విజయం సాధించిన భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా హాంకాంగ్ ను ఢీకోనుంది. హాంకాంగ్ పై ఆడే జట్టులో రిషిబ్ పంత్ కు అవకాశం ఇస్తుందా? ఒకవేళ రిషిబ్ పంత్ ను తీసుకుంటే కేఎల్ రాహుల్ ను పక్కన పెడతారా? దినేష్ కార్తీక్ ను పక్కకు పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనింగ్ భాగస్వామ్యం ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రాహుల్ మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. మరోవైపు పాక్ తో మ్యాచ్ లో రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్ కు టీం మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది.
హాంకాంగ్తో నేడు జరిగే మ్యాచ్లో టీమిండియా జట్టులో పలు మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. రిషిత్ పంత్ ను జట్టులోకి తీసుకొని రాహుల్, దినేష్ కార్తీక్ లలో ఒకరిని పక్కకు పెడతారని తెలుస్తోంది. మరోవైపు ఓపెనింగ్ విభాగంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకోని పక్షంలో రోహిత్ శర్మతో విరాట్ కోహ్లీని ఓపెనర్ గా పంపిస్తే ఎలాఉంటుందనే విషయంపై టీం మేనేజ్మెంట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక బౌలింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేకుండానే హాంకాంగ్తో జరిగే మ్యాచ్ కు తుదిజట్టును ఫైనల్ చేసే అవకాశాలుఉన్నాయి. మొత్తానికి పసికూనతో జరిగే మ్యాచ్ లో భారీ విజయంపై కన్నేసిన టీమిండియా బ్యాటింగ్ విభాగంలో స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.