Bandi Sanjay: రాళ్ల దాడులనూ భరిస్తా.. ప్రజా సమస్యలపై పోరాడతా -బండి సంజయ్
సీఎం కేసీఆర్ ఉపన్యాసాలకు భయపడమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ ఉపన్యాసాలకు భయపడమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా.. కొనరా అని అడిగామని.. ధాన్యం కొనడానికి కేసీఆర్కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. రైతుల కోసం రాళ్ల దాడులనైనా భరిస్తామన్నారు బండి సంజయ్.
ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారని సంజయ్ ఆరోపించారు. కొనుగోళ్లు సరిగా సాగితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్కు పట్టుకొచ్చామని అన్నారు బండి సంజయ్. ఇప్పుడు ప్రగతి భవన్ నుంచి ధర్నాచౌక్కూ తీసుకొస్తున్నామని తెలిపారు. ఇది బీజేపీ సాధించిన విజయంగా అభివర్ణించారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సీఎం దగ్గర డబ్బుల్లేవా? అని నిలదీశారు. ఏడేళ్లనుంచి రాష్ట్రమే కొంటోందని ప్రచారం చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు కొనట్లేదని ప్రశ్నించారు. తాము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే యాత్రలు చేస్తున్నామని దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను చేపడితే రైతులు వరి ధాన్యం కుప్పల మీద ఎందుకు చనిపోతున్నారో చెప్పాలని అన్నారు.