CM Revanth Reddy : జీవన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

2018లో ఎదురైన ఓటమి 2024లో సీఎంగా గెలవటానికి నాకు పునాది అయింది.

CM Revanth Reddy : జీవన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నాది- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Cm Revanth Reddy

CM Revanth Reddy : నిజామాబాద్ లో ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అందులో జీవన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాబోతున్నారని, జిల్లాను అభివృద్ది చేస్తారని ఆయన అన్నారు. జీవన్ రెడ్డికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా కేంద్ర పెద్దలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా.. ఆయనను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”2021 జనవరి 31న ఆర్మూర్ లో పసుపు బోర్డుపై ఆందోళన చేపట్టిన రైతులకు నేను మద్దతు పలికా. ఆనాడు పసుపు బోర్డు కోసం ఉద్యమించిన వారికి మద్దతు తెలిపినందుకు టీపీసీసీ పగ్గాలు చేపట్టా. అందుకే నాకు నిజామాబాద్ అంటే అభిమానం. 17 సెప్టెంబర్ లోపల చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. కవిత ఐదేళ్ల కాలంలో పసుపు బోర్డు తెరిపించలేదు. ఎర్ర జొన్నలకు మద్దతు ధర కల్పించలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదు. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న కవితను 100 కిలోమీటర్ల దూరంలో తరిమిన చరిత్ర నిజామాబాద్ కు ఉంది. 5 రోజుల్లో పసుపు బోర్డు తెప్పిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ఐదేళ్లైనా పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పటం లేదు.

ఏ ప్రభుత్వమైనా మెడలు వంచి తమ పని చేయించుకున్న చరిత్ర ఆర్మూర్ ప్రాంత రైతులకు ఉంది. ఆనాడు రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తాను మల్కాజ్ గిరి పార్లమెంటులో ఎంపీగా పోటీ చేసి గెలిచా. 2018లో ఎదురైన ఓటమి 2024లో సీఎంగా గెలవటానికి నాకు పునాది అయింది. దేవుడు గుడిలో వుండాలి. భక్తి గుండెల్లో వుండాలి. పోలింగ్ బూత్ డబ్బాలలో కాదు. సెక్యూలర్ పాలన కోసమే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చారు. బాసర సరస్వతి అమ్మవారిపై ఒట్టేసి చెబుతున్నా.. ఆగస్ట్ 15 లోపల రైతుల రుణమాఫీ చేసి తీరతా. రైతులు ఎంతైనా వరిని పండించుకోండి. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తాం” అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

”కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ నన్ను ఓడగొట్టారు. అక్కడ ఓడినా.. మల్కాజ్ గిరిలో ఎంపీగా గెలిచా. చక్కెర పరిశ్రమను కేసీఆర్ మూతపడేలా చేశారు. ఎన్నికల తర్వాత చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. సెప్టెంబర్ 17లోపు చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. షుగర్ ఫ్యాక్టరీని తెస్తానని కవిత మోసం చేశారు. నిజామాబాద్ రైతులను మోసం చేస్తే వారిని ఇక్కడి రైతులు రాజకీయ సమాధి చేశారు. 14లో బీఆర్ఎస్ కు ఓటు వేశారు. కవిత మిమ్మల్ని మోసం చేశారు. 19లో ధర్మపురి అరవింద్ కు ఓటు వేశారు. ఆయన కూడా మిమ్మల్ని మోసగించారు. మోసం చేసినోళ్లు కావాలా? మోసం చేసిన పార్టీలు కావాలా? పదేళ్లు ప్రభుత్వంలో ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాశిలో మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేయబోతే పోలీసులను పెట్టి నిజామాబాద్ రైతాంగాన్ని కొట్టించిన ఘటన మర్చిపోయారా? బీఆర్ఎస్ ను చూశారు, బీజేపీనీ చూశారు. ఒక్కసారి జీవనన్నకు అవకాశం అవ్వండి. పెద్ద మనిషి, రైతు బిడ్డ, రైతు. వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు. ఆయన కంటే రైతుల గురించి బాగా తెలిసిన నాయకులు ఎవరైనా ఉన్నారా? ధర్మపురి అరవింద్ కు వ్యవసాయం తెలుసా? అలాంటోళ్లకు ఓటు వేయొద్దు” అని సీఎం రేవంత్ అన్నారు.

రూ.2లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..
రూ.2లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరతామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. ఆరో గ్యారంటీ రుణమాఫీ చేపట్టేలోపే ఎన్నికల కోడ్ వచ్చిందని వెల్లడించారు.

Also Read : ఖమ్మం సీటు విషయంలో పట్టువీడని పొంగులేటి, భట్టి.. డీకే వద్దకు పంచాయితీ..!