CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

CM Revanth Reddy met PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధానితో భేటీ కావటం ఇది మూడోసారి. రేవంత్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీలో హైదారాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫీచర్ సిటీకి సహకారం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా విభజన హామీలు, పెండింగ్ నిధులు సహా రంగాల వారీగా పలు విజ్ఞాపనలను నరేంద్ర మోదీకి చేశారు.
ఇదిలాఉంటే రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే.. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వెళ్లిన వారిలో అధికారులు సీఎస్ శాంత కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, డీజీపీ జితేందర్ కూడా ఉన్నారు.