Telangana Election Notification : తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Telangana Election Notification : తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Election Notification Issued For 2 Corporations And 5 Municipalities In Telangana

Updated On : April 15, 2021 / 4:16 PM IST

Election notification in Telangana : తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 19న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 22న నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం కల్పించారు. 30న పోలింగ్‌ జరగనుండగా….మే 3న ఫలితాలు వెల్లడించనున్నారు.

అలాగే వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 8 మున్సిపాలిటీల్లో మృతిచెందిన కౌన్సిలర్ల స్థానాలకు…గ్రేటర్‌ పరిధిలోని లింగోజిగూడలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 6 లక్షల 52 వేల తొమ్మిది వందల 66 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా….రెండు లక్షల 81 వేల మూడు వందల 87 మంది ఓటర్లు ఉన్నారు. ఇక అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. మొత్తం 20 వేల ఐదు వందల 29మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు లక్షా ఆరు వందల 53 మందికి ఓటు హక్కు ఉంది.

నకిరేకల్‌ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 21 వేల 35 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డుల్లో 41 వేల ఐదు వందల 15మంది ఓటర్లు ఉన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులు, ఎనిమిది వేల 136 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 15 వందల32 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అలాగే రెండు వేల నాలుగు వందల 79 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు.