Minister Komatireddy Venkat Reddy : చారిత్రక భవనాలను పునరుద్ధరిస్తాం.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అడుగుతానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Komati Reddy Venkat Reddy
Minister Komatireddy : వచ్చే రెండుమూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని రోడ్లు, భవనాలు(ఆర్ అండ్ బీ)శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం సచివాలయంలో ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మొత్తం తొమ్మిది దస్త్రాలపై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని నాలుగు లైన్లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన దస్త్రాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల మెరుగుకు కృషిచేస్తానని అన్నారు.
Also Read : CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అడుగుతానని తెలిపారు. అలాగే విజయవాడ – హైదరాబాద్ రహదారిని ఆరు లైన్లకు, హైదరాబాద్ – కల్వకుర్తి నాలుగు లైన్లకు పెంచాలని, వీటితో మరికొన్ని పనులకు ఆమోదంకోసం కేంద్ర మంత్రిని కలుస్తానని చెప్పారు. సోమవారమే కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తానని వెంకట్ రెడ్డి చెప్పారు. గత పదేళ్లుగా రహదారులపై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
Also Read : Telangana ministers : తెలంగాణలో ముగ్గురు మంత్రులపై క్రిమినల్ కేసుల్లేవు….
చారిత్రక భవనాలను పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారని హరీశ్ రావు మాట్లాడుతున్నారని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిమీదా కావాలని కక్ష సాధించం.. తప్పులు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం. రహదారుల నిర్వహణే మా మొదటి ప్రాధాన్యత అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.