తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కోర్టు సీరియస్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ..
తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. మాజీ మంత్రి కేటీఆర్పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది.
కొండా సురేఖ విచారణకు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేస్తూ.. ఆ రోజున కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని చెప్పారు. లేదంటే పోలీసులే నాన్ బెయిలబుల్ వారెంట్తో ఆమెను హాజరుపర్చాలని ఆదేశించారు.
కాగా, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఈ ఏడాది ఆగస్టు 2న నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ సహా సినీనటి సమంత విడాకుల విషయంలో కేటీఆర్పై కొండా సురేఖ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. (Konda Surekha)
దీంతో కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర్టు అప్పట్లోనే ఆదేశించింది.
కొండా సురేఖ చేసిన చేసిన కామెంట్లను న్యాయస్థానం నేరంగా పరిగణించింది. కేటీఆర్ తరఫు లాయర్ సిద్ధార్థ్ పోగుల చేసిన వాదనలను న్యాస్థానం సమర్థించింది. ఇప్పటికే సాక్షుల వాంగ్మూలాలతో పాటు కేసు సంబంధించిన పత్రాలను పరిశీలించింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నట్లు ఆగస్టులో తేల్చింది.
‘నాన్బెయిలబుల్’ ప్రచారాన్ని ఖండించిన సురేఖ
తనకు కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని కొండా సురేఖ అన్నారు. ఫిబ్రవరి 5న విచారణకు హాజరుకావాలని కోర్టు చెప్పిందని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె అన్నారు.
