Palakurthy: కాంగ్రెస్కు ఎన్ఆర్ఐ కష్టం.. ఝాన్సీరెడ్డికి ఆదిలోనే అడ్డంకులు
ఓటమి ఎరుగని నేత మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించాలని స్కెచ్ వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ వర్క్వుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
Palakurthi Constituency: మంత్రి ఎర్రబెల్లిపై టీపీసీసీ ఎక్కుపెట్టిన బాణం చిక్కుల్లో పడుతోందా? అధికార బీఆర్ఎస్ను.. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఎర్రబెల్లిని నిలువరించాలనే కాంగ్రెస్ స్కెచ్ పనిచేసే చాన్స్ కనిపించడం లేదా? ఎర్రబెల్లి టార్గెట్గా వాయు వేగంతో సంధించిన ఎన్ఆర్ఐ అస్త్రం పనిచేయడం లేదా? పాలకుర్తి పాలిటిక్స్లో ఇప్పుడిదే ప్రధాన చర్చ జరుగుతోంది. ఇంతకీ పాలకుర్తిలో ఏం జరుగుతోంది? ఎన్ఆర్ఐ నేతకు ఎదురవుతున్న సమస్యలేంటి?
ఓటమి ఎరుగని నేత మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించాలని స్కెచ్ వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ వర్క్వుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎర్రబెల్లికి దీటుగా అంగ, అర్థబలాల్లో ఢీకొట్టగల మహిళా నేత.. ఎన్ఆర్ఐ అనుమాండ్ల ఝాన్సీరెడ్డిని పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు రేవంత్రెడ్డి. తొర్రూరు మండలం చెర్లపాలెం సహా పలు ప్రాంతాల్లో సొంత నిధులతో పనులు చేపట్టి ఓటర్లకు చేరువయ్యారు ఝాన్సీరెడ్డి. ఆమె సేవా కార్యక్రమాలను గుర్తించిన కాంగ్రెస్ పిలిచి టికెట్ ఇస్తామనడంతో ఆమె కూడా ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తూ ఎన్నికల్లో పోటీకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే ఝాన్సీరెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. దయాకర్రావును టార్గెట్గా చేసుకుందామనుకున్న ఆమెను పార్టీలోని గ్రూపులు సహా సాంకేతిక అంశాలు చుట్టుముడుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి కాంగ్రెస్కు అభ్యర్థే కరవు అన్న ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అంతేవేగంగా, ఉత్సాహంగా.. భారీ కాన్వాయ్తో పాలకుర్తి నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు ఝాన్సీరెడ్డి. కానీ.. రోజులు గడిచే కొద్దీ పార్టీలోని పరిస్థితులు, ఆమె పోటీ చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డు వస్తున్నాయనే ప్రచారం జరగుతోంది. ప్రధానంగా ఝాన్సీరెడ్డి భారతీయ పౌరసత్వంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చమొదలైంది.
పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమైన అనుమాండ్ల ఝాన్సీరెడ్డికి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలు భారతీయ పౌరసత్వం లేని వారు.. ఇక్కడి ప్రభుత్వంపై, పథకాలపై, మంత్రులపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అంతేకాకుండా భారత ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది గులాబీపార్టీ.
పౌరసత్వ సమస్య తెరమీదకు తెస్తారని ఊహించే ఝాన్సీరెడ్డి ముందునుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు ఆమె సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. సకాలంలో భారతీయ పౌరసత్వం వస్తుందో రాదోనన్న సందేహంతో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిందంటున్నారు. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి తన పౌరసత్వం విషయంలో టెక్నికల్ అంశాలు అడ్డు వస్తే తన కోడలు యశస్వినిరెడ్డిని పోటీకి పెట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే టీపీసీసీలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. మూడేళ్ల కిందటే ఝాన్సీరెడ్డి కుమారుడితో వివాహమైన యశశ్వని ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. భారతీయ పౌరసత్వం కలిగిన యశస్వినికి టికెట్ ఇచ్చేందుకు కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సముఖతతో ఉన్నట్టు చెబుతున్నారు.
Also Read: కేసీఆర్ ఆటలో రేవంత్రెడ్డి బలి కాబోతున్నారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి తన తండ్రి మరణం తర్వాత 11 సంవత్సరాల వయసులో 1977లో తల్లితో కలిసి అమెరికాకు వెళ్లారు. 1982లో డాక్టర్ రాజేందర్ రెడ్డిని అమెరికాలోనే వివాహం చేసుకున్నారు. అయితే పౌరసత్వం విషయంలో ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. తాను ఇక్కడే పుట్టి పెరిగానని… తన అమెరికా పౌరసత్వం తన సేవలకు అడ్డు కాదని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పౌరసత్వ సమస్య అడ్డుకాదని, అసలు అది పెద్ద సమస్య కాదన్నట్లే వ్యవహరిస్తున్నారు ఝాన్సీరెడ్డి. ప్రజలను మభ్య పెట్టేందుకు రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటున్నారు ఝన్సీరెడ్డి.
Also Read: ఎన్నికల ముందు బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కీలక నేత
మరోవైపు ఝాన్సీరెడ్డి పౌరసత్వంపై ముందుగానే విమర్శలు మొదలవడంతో అలర్ట్ అవుతోంది కాంగ్రెస్. రాష్ట్రంలో ఇప్పటికే ఇదే తరహా వివాదంతో కేసులు ఎదుర్కొంటున్నారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్. ఎమ్మెల్యేకు విదేశీ పౌరస్వతంపై నెలకొన్న వివాదంతో తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్.. వ్యక్తిగతంగా మంచి పేరు, ఎమ్మెల్యేగా సమర్థంగా పనిచేసినా రమేశ్కు టికెట్ ఇవ్వలేకపోవడానికి కారణం పౌరసత్వ సమస్యేనని క్లియర్గా చెప్పారు సీఎం కేసీఆర్.. ఇలాంటి పరిస్థితుల్లో పాలకుర్తిలో అదేరకమైన సమస్య బటయపడటం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తోంది.