Telangana Assembly: స్పీకర్ పై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు.. హరీశ్ రావు కీలక కామెంట్స్
జగదీశ్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు.

Harish Rao
Telangana Assembly Sessions 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు హాట్ హాట్ గా సాగాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ సభ్యులు జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో స్పీకర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారితీశాయి.
సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం కొనసాగుతున్న సమయంలో స్పీకర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సభను అవమానించే విధంగా ప్రవర్తించొద్దు అంటూ స్పీకర్ సూచించారు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దని అనడంతో.. జగదీశ్ రెడ్డి స్పందిస్తూ స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమే, ఈ సభ అందరిది, మీ ఒక్కరికే సొంతం కాదు.. అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ను అవమానించే విధంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిగా బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేశారు.
Also Read: KTR: బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా..? కేటీఆర్ ఫైర్
జగదీశ్ రెడ్డి సభలో చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. జగదీశ్ రెడ్డి స్పీకర్ ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిది కాదు.. సభ అందరిదీ అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కాదు అంటూ హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలియదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు అంటూ హరీశ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. మేము స్పీకర్ ను కలిసి సభా రికార్డులు తీయాలని కోరడం జరిగింది. స్పీకర్ ను అగౌరవపరిచే విధంగా జగదీశ్ రెడ్డి మాట్లాడలేదు. జగదీశ్ రెడ్డి మాట్లాడిన సమయంలో సభ వీడియో రికార్డును స్పీకర్ ను అడిగాం. 15 నిమిషాలయినా వీడియో రికార్డును స్పీకర్ కార్యాలయం తెప్పించలేదని హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.