తూ.గోదావరి : బాహుబలి గొబ్బెమ్మకు భారత టాలెంట్ ఆఫ్ రికార్డు

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామంలో బాహుబలి గొబ్బెమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామంలోని ఉదాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు, మహిళలు, కమిటీ సభ్యు వారం రోజుల పాటు శ్రమించి 5 టన్నుల ఆవు పేడను సేకరించారు. ఆ ఆవుపేడతో 10.10 అడుగుల ఎత్తు గొబ్బెను తయారు చేశారు. ఆ గొబ్బెమ్మను పూలదండలతో అందంగా అలంకరించారు. మహిళలంతా సంప్రదాయం ఉట్టిపడేలా ఈ బాహుబలి గొబ్బెమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో అలరించారు. ఈ బాహుబలి గొబ్బెమ్మతో ‘‘భారత టాలెంట్ ఆఫ్ రికార్డు’’ సాధించారు.
బాహుబలి గొబ్బెమ్మల వేడుకల్లో భాగంగా మహిళలు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గొబ్బెమ్మ పాటలు పాడి అంతరించిపోతున్న సాంప్రదాయాలను గుర్తుచేసారు స్థానికులు. కాలాను గుణంగా మారుతున్న సంప్రదాయాలు కొత్త కోణాల్లో ఆవిషృతమవుతున్నాయనటానికి ఈ బాహుబలి గొబ్బ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సంక్రాంతి పండుగ: గౌరీదేవిగా పూజించే గొబ్బెమ్మ
సంక్రాంతి పండుగ అంటే చిన్నారులతో పాటు యువతులు..మహిళలు గొబ్బెలతో సందడి చేస్తుంటారు. వేకువఝామునే లేచి స్నానం చేసి ఆవుపేడతో గొబ్బెలు చేసి ఇంటి ముందు రంగు రంగుల రంగవల్లిలు వేసి..ఆ రంగవల్లికల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. పసుపు,కుంకుమలతోను..పువ్వులతోను అలంకరిస్తారు. గొబ్బెమ్మను గౌరీదేవిగా కొలుస్తారు. పూజిస్తారు. తరువాత ఆ గొబ్బమ్మను సాయంత్రం గోడలకు పిడకలుగా చేసిన అతికిస్తారు. అలా సంక్రాంతి నెల ప్రారంభం నాటినుంచి ప్రతీ రోజు ఉదయం గొబ్బెల్ని చేయటం..వాటిని పిడకలుగా చేస్తారు. ఆ పిడకలను భోగి పండుగ రోజున భోగిమంటల్లో వేసి కాలుస్తారు. ఇది సంక్రాంతి పండుగల వేడుకల్లో ముఖ్యమైన సంప్రదాయంగా కొనసాగుతోంది.