Ap Summer : మరో 5 రోజులు జాగ్రత్త.. ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.

Hot Summer In Andhra Pradesh
Ap Summer : తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పుల తీవ్రత అధికం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల నమోదు, ఏపీలో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.
ఏపీలో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలలో వడగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర ఉక్కపోత వాతావరణం ఉంది. మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.
తిరుపతి వాసులను భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోయాయి. గ్రీష్మ తాపానికి ప్రజలు తల్లిడిల్లిపోతున్నారు. ఎటు చూసినా కర్ఫ్యూ వాతావరణం తిరుపతి నగరంలో కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇదే తరహాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా తిరుపతి, చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందంటే.. ఎండల తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : ఎండలు భగభగ.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఆ జిల్లాల్లో ఐదు రోజులు డేంజర్ బెల్స్