పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు అదిరిపోయే స్పీచ్.. సోనియా గాంధీ భావోద్వేగం.. చప్పట్లు కొడుతూనే!

  • Published By: vamsi ,Published On : December 3, 2019 / 01:55 AM IST
పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు అదిరిపోయే స్పీచ్.. సోనియా గాంధీ భావోద్వేగం.. చప్పట్లు కొడుతూనే!

తెలుగు దేశం ఎంపీ రామ్ మోహన్ నాయుడు.. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటులో గట్టిగా వినిపించే గళం అతనిదే. అతని మాటలకు పార్లమెంటులో ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. పార్లమెంటులో ప్రశ్నలు సంధించాలన్నా.. ఉపన్యాసాలతో ఆకట్టుకోవాలన్నా రామ్మోహన్ నాయుడు పద్దతే వేరు. లేటెస్ట్‌గా ‘జస్టిస్ ఫర్ దిశ’పై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా  ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘటనపై గట్టిగా మాట్లాడారు.

ఇదే సమయంలో పార్లమెంటులో ఎంతోమంది ఉపన్యాసాలను విని, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నంత సేపు చప్పట్లు కొడుతూనే ఉండడం విశేషం. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..  శంషాబాద్ డాక్టర్ దిశపై జరిగిన హత్యాచారం ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని లోక్‌సభలో తెలిపారు. అత్యాచార దోషులకు కఠినశిక్షలు పడేలా సమర్ధమైన చట్టాలు తేవాలని, మహిళ భద్రతపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని కోరారు.

ఇదే సమయంలో మృతురాలు తన చెల్లెలితో మాట్లాడిన ‘భయం వేస్తుంది’ అన్న మాటను నొక్కి చెప్పారు. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడిన ఎంపీ.. ఈ ఒక్క మాటను మాత్రం తెలుగులో మాట్లాడారు. దేశంలోని అమ్మాయిలందరూ భయం వేస్తోందని అంటున్నారని, దేశంలో ప్రతి ఒక్క యువతి భయంతో వణికిపోతోందని చెప్పారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన విధానానికి మెచ్చిన సోనియా గాంధీ భావోద్వేగంతో చప్పట్లు కొడుతూనే ఉన్నారు.

స్వతహాగానే ఉపన్యాసం ఇవ్వడంలో ఆరితేరిన ఈ యంగ్ ఎంపీ.. గతంలోనూ పార్లమెంట్‌లో అందరి చేత జేజేలు కొట్టించుకున్నారు. అయితే సోనియా గాంధీ చేత ప్రత్యేకంగా పార్లమెంటులో చప్పట్లు కొట్టిపించుకునేలా మాట్లాడడం విశేషం.