అమరావతి, పోలవరంపై బాబు ప్రత్యేక నజర్.. శాఖలపై పట్టు సాధించేందుకు పవన్ ఫోకస్
AP Politics: పాలనలో పర్ఫెక్ట్గా పనిచేసే అధికారులను ఎంకరేజ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్.
![అమరావతి, పోలవరంపై బాబు ప్రత్యేక నజర్.. శాఖలపై పట్టు సాధించేందుకు పవన్ ఫోకస్ అమరావతి, పోలవరంపై బాబు ప్రత్యేక నజర్.. శాఖలపై పట్టు సాధించేందుకు పవన్ ఫోకస్](https://10tv.in/wp-content/uploads/2024/06/Chandrababu-Naidu-Pawan-kalyan-1.jpg)
Chandrababu Naidu, Pawan kalyan (1)
సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్. రాజకీయ ప్రత్యర్థులకు ఈ పిక్చర్ చూస్తేనే వైబ్రేషన్. సమ్థింగ్ స్పెషల్. బాబు అంటే పడనివారు.. పవన్ ఫ్యాన్స్ కాని వారు కూడా.. ఈ ఇద్దరు ఓకే ఫ్రేమ్లో కనబడితే చాలు ఓ లుక్కేస్తారు. రీజన్ ఒక్కటే చంద్రబాబు, పవన్.. ఏపీని డెవలప్ చేస్తారన్న నమ్మకమే.
ఆశామాషీగా కాకుండా ఏకంగా పదేళ్లు కష్టపడి అధికారంలోకి వచ్చిన పవన్.. ఐదేళ్లు ఎన్నో కష్టాలు చూసిన బాబు..ఈసారి పవర్ను లైట్ తీసుకోవడం లేదు. అధికారం వచ్చింది కదా అని ఎగిసి పడటమూ లేదు. ఏపీని ఏదో విధంగా అభివృద్ధి చేయాలనే తపన మాత్రం ఆ ఇద్దరి నేతల్లో కనిపిస్తుంది. పరిస్థితులు కలసి వచ్చి..కేంద్రం నిధులు ఇచ్చి..అన్నీ అనుకున్నట్లు జరిగితే..చంద్రబాబు, పవన్ అనుకున్న రూట్మ్యాప్లో ఏపీ డెవలప్ పక్కా అన్న అంచనాలు ఉన్నాయి.
వరుస రివ్యూలతో బిజీగా
సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకున్న పవన్ కల్యాణ్.. వరుస రివ్యూలతో బిజీగా గడుపుతున్నారు. బాబు సీఎంగా చార్జ్ తీసుకోగానే.. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ప్రయారిటీ తీసుకున్నారు. ఫస్ట్ పోలవరంపై రివ్యూ చేసిన ఆయన.. వెంటనే పోలవరం పర్యటనకు వెళ్లారు.. పనులు ఎంత వరకు వచ్చాయి.. ఎక్కడ లోపాలున్నాయి.. ఇంకా ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయో ప్రత్యక్ష్యంగా పరిశీలించారు.
టార్గెట్ టైమ్లో పూర్తి చేయడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాలో అధికారులకు వివరించారు.. అక్కడికక్కడే కాంట్రాక్టర్లతోనూ మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు.. డెడ్లైన్తో పనులు పూర్తి చేయాలని సూచించారు.. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు.
సెకండ్ టార్గెట్
సెకండ్ టార్గెట్గా రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టిన సీఎం అక్కడికి వెళ్లి ప్రజలతో, రైతులతో మాట్లాడారు.. రాజధాని కోసం కట్టిన భవనాలను, సగంలో ఆగిపోయిన పనులను పరిశీలించారు.. నవ్యాంధ్ర రాజధాని ఎలా ఉండాలో తన ఆలోచనలో ఉన్న ప్లానింగ్ను ఏంటో మరోసారి వివరించారు.
ఇలా పాలనా వ్యవస్థను బాగుచేయడంతో పాటు.. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దే పనిలో పడ్డారు బాబు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు సైతం ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు.
సేమ్టైమ్ ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మద్యం పాలసీ, ఇసుక పాలసీపై కూడా అధికారులకు ఆదేశాలిచ్చి.. అంతా ట్రాక్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఫ్యూచర్ ప్లానింగ్పై కూడా బాబు ఫోకస్తో పనిచేస్తున్నారు. ఎటొచ్చి ప్రజలు పెట్టిన నమ్మకం చాలా పెద్దదనేది బాబు భావన. 161 సీట్లు కూటమికి ఇవ్వడమే కాకుండా.. బాబు అయితేనే ఏపీని డెవలప్ చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని విషయాన్ని ఆయన గమనించారు.
అందుకే దేశ విదేశాల్లో ఉన్న ఏపీవాసులు..కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని ఆయన తన ప్రసంగాల్లో చెప్పుకొస్తున్నారు. వాళ్లందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందేనని ప్రజాప్రతినిధులకు, ఆదేశాలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే సుదీర్ఘ సమీక్షలతో అధికారుల్ని ఆశ్చర్యపరిచారు.
డిప్యూటీ సీఎం పోస్ట్తో పాటు ఆయన కీలకమైన నాలుగు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో తనకు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం లేకపోయిన సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ.. ఆయా శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సంస్థల పాలన, మౌలిక వసతుల కల్పన, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై.. ఓపికగా అధికారులు చెప్పిన విషయాలను నోట్ చేసుకుంటూ.. తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ సమీక్ష చేశారని అధికారులు చెబుతున్నారు.
ఉన్నతాధికారులను గౌరవిస్తూనే.. కార్యక్రమాలను ఎలా చేయాలనుకుంటున్నారో తన ఆలోచనలు షేర్ చేసుకున్నారు పవన్ కల్యాణ్.. రెండు రోజుల్లో దాదాపు 20 గంటల పాటు ఏకధాటిగా పవన్ సమీక్షలు చేశారు. అన్ని శాఖలపై పట్టు సాధించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఉపాధి హామీ పథకం తీరు.. ఇలా చాలా అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర పనులకు మళ్లించడంపై అధికారులపై సీరియస్ అయ్యారు.
మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల్లో ప్రాధాన్యత అంశాలను గుర్తించి..పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ కనబరిచిన ఆసక్తి, చేసిన సూచనలు బాగున్నాయనే టాక్ అధికారిక వర్గాల్లో వినిపించింది.
ప్రజలతో మమేకం అవ్వడంలోనూ..
అధికారులతో సమీక్షల్లోనే కాదు ప్రజలతో మమేకం అవ్వడంలోనూ, ప్రజా సమస్యలను తెలుసుకోవడంలోనూ నాయకుడిగా పరిణత చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్.. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారితో ఓపికగా మాట్లాడి వారి ఆవేదనను వింటున్నారు.. అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా తన కార్యాలయం ముందు కుర్చీ వేసుకొని కూర్చొని మరీ జనం బాధలను వింటున్న పవన్ తీరు నాయకుడిగా అతనిలోని పరిణతికి అద్దం పడుతోంది..
మరోవైపు పాలనలో పర్ఫెక్ట్గా పనిచేసే అధికారులను ఎంకరేజ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్న పవన్..తన ఓఎస్డీగా కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజకు డిప్యుటేషన్పై తెంచుకుంటున్నారు. అతడ్ని కేరళ నుంచి రిలీవ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సర్కారు కోరింది.
కృష్ణతేజ పనితీరుపై గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో పాటు విధి నిర్వహణలో స్ట్రిక్ట్గా ఉంటారనే గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణతేజ కేరళ టూరిజం డెవలప్మెంట్ ఎండీగా, పర్యాటకశాఖ డైరెక్టర్గా, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్గా, అలప్పుజ జిల్లా కలెక్టర్గా పనిచేశారు.
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల పవన్ కల్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలా ఇద్దరు నేతలు పక్కా ప్లానింగ్, పకడ్భందీ వ్యూహంతో ముందు కెళ్తున్నారు. నవ్యాంధ్ర అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత పాలకుల హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది..ఏపీ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పనిచేస్తున్నారు.