ఇకపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు, సీఎం జగన్ కీలక నిర్ణయం

  • Published By: naveen ,Published On : July 25, 2020 / 08:54 AM IST
ఇకపై రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకూడదు, సీఎం జగన్ కీలక నిర్ణయం

రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పంటలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడకూడదు:
పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడకూడదని, వారు ఎక్కడా రోడ్డెక్కే పరిస్థితి కనిపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై శుక్రవారం(జూలై 24,2020) తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జగన్. ఈ సందర్భంగా కొన్ని పంటలకు మార్కెటింగ్‌ లేక కనీస గిట్టుబాటు ధరలు రాని అంశాన్ని స్వయంగా జగనే ప్రస్తావించారు. ఈ సీజన్‌ నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్త పడాలని, దీని కోసం ఎంత ఖర్చు అయినా పర్వా లేదన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు.

పంటలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడకూడదు:
”పంట నిల్వ ఉండక, వాటికి తగిన మార్కెటింగ్‌ లేక, కనీస గిట్టుబాటు ధరలు రాక ఏటా అరటి, చీని, టమాటా, ఉల్లి, నిమ్మ, పసుపు, మిర్చి తదితర పంటలు పండించే రైతులు ఆందోళన చెందుతున్నారని సీఎం జగన్ వాపోయారు. పంటలు అమ్ముకునేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆయా పంటలకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి. మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి. రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఎంత మేర కొనుగోలు చేయాలి, ఎంత మేర ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు తరలించాలన్న దానిపై అధికారులు దృష్టిపెట్టాలి. దీని కోసం ఖర్చు ఎంత అయినా పర్వాలేదు, కాని సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి”-సీఎం జగన్.

వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలి:
ప్రతి ఏటా అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మ లాంటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. మళ్లీ ఇలాంటి కథనాలు కనిపించకూడదని, ప్రతి ఏటా ఇలాంటివి పునరావృతం కాకూడదని ఆదేశించారు. మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ప్రఖ్యాత కంపెనీలతో టైఅప్‌ చేసుకోవాలన్నారు. ఇబ్బందులు వస్తున్న పంటలను గుర్తించి, వాటిని ప్రాసెసింగ్‌ చేసి వాల్యూ ఎడిషన్‌ ఏం చేయగలమో ఆలోచించాలన్నారు. నెల రోజుల్లోగా దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన చోట్ల ఆర్బీకేల స్థాయిలోనే ప్రాథమిక స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయాలని.. మండల, నియోజకవర్గ స్థాయిలో అంచనాలు తయారు చేయాలన్నారు.

శాశ్వత పరిష్కారం కావాలి:
* రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఏ పంట, ఎంత వరకు కొనుగోలు చేయాలి? ఎంత మేర ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు తరలించాలన్న దానిపై అధికారులు దృష్టి పెట్టాలి. ఖర్చు ఎంతైనా పర్లేదు, కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలి.
* పంటలకు గిట్టుబాటు ధరలు రావడంతో పాటు, వాటి మార్కెటింగ్‌లో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. అవసరమైతే ధరల స్థిరీకరణ నిధి ఉపయోగిస్తుంది. ఈ ఏడాది దాదాపు రూ.3 వేల కోట్లు వ్యయం చేశాం. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవస్థీకృతంగా సిద్ధం కావాలి.
* వచ్చే సీజన్‌ కల్లా రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా మార్కెటింగ్‌ లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులకు ప్రధానంగా ఇబ్బందులు తెస్తున్న ఏడెనిమిది పంటలను గుర్తించాలి. వాటి ప్రాసెసింగ్‌తో పాటు, వాల్యూ ఎడిషన్‌ ఏం చేయగలమో ఆలోచించాలి. వీటి కోసం మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి.
* ప్రాథమికంగా ఆర్‌బీకే స్థాయిలో, ఆ తర్వాత మండల, నియోజకవర్గ స్థాయిల్లో అంచనాలు తయారు చేయాలి.

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిల్యాబ్స్ ఏర్పాటు:
రైతులకు మరో శుభవార్త కూడా వినిపించారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతో మేలు చేయనుంది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్సార్‌ అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతిలో ప్రాంతీయ ల్యాబ్స్‌ ఉంటాయి. ఈ ల్యాబ్‌లలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించనున్నారు. ఇందుకోసం 197 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌ నివేదికను ప్రభుత్వం నాబార్డు సమర్పించింది. దీంతో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ కింద ఇప్పటికే రూ. 150 కోట్లు మంజూరు చేసింది.

ఏటా నకిలీ విత్తనాలు, నాసిరకమైన ఎరువులు, పురుగు మందులతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. నకిలీలను నివారించేందుకు అధికారులు ఎంత నిఘా పెట్టిన అక్రమార్కులు వాటిని కొత్తదారుల్లో ఎప్పటికప్పుడు రైతాంగానికి అంటగడుతూనే ఉన్నారు. ఫలితంగా రైతులు పంట దిగుబడినే కోల్పోవడమే కాకుండా ఆర్థికంగానూ చితికిపోతున్నారు. దీన్ని గమనించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.