హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు

  • Published By: madhu ,Published On : August 3, 2020 / 12:36 PM IST
హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు

హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. మహిళ స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకొంటోంది. అందులో భాగంగా..2020, జులై 03వ తేదీ సోమవారం హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు జరిగాయి.



సీఎం జగన్‌ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ్‌ పూరి, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీఈఓ, ఎండీ మధుసూదన్‌ గోపాలన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హెచ్‌యూఎల్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ్‌ మెహతా, ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజివ్‌ పూరి, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీఈఓ, ఎండీ మధుసూదన్‌ గోపాలన్‌ పాల్గొన్నారు.

సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీనియర్‌మేనేజర్‌ జోసెఫ్‌వక్కీ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా..సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, ఐటీసీ డివిజనల్‌ సీఈవో రజనీకాంత్‌ కాయ్‌ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సెర్ప్‌ సీఈఓ రాజాబాబు, హెచ్‌యూఓల్‌ జీఎస్‌ఎం చట్ల రామకృష్ణారెడ్డి మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.



సీఎం జగన్ మాట్లాడుతూ…
‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాగే వ్యవస్థలో దిగువన ఉన్న వారి తలరాతలను మార్చకపోతే… మార్పులు సాధ్యం కావు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళల జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తున్నాం. ఆగస్టులో 12న వైయస్సార్‌ చేయూత ప్రారంభిస్తున్నాం. మహిళా సాధికారితపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత మహిళలకు చేయూతను అందిస్తున్నాం. పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో మేం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈ కేటగిరీలో ఉన్న మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

వీరు చాలా కాలంగా నిరాదరణకు గురయ్యారు. వీరంతా స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. చేయూత కింద ఎంపిక అయిన మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఇస్తాం. ప్రతి ఏటా రూ.18750లు ఇస్తాం. ఈ సహాయాన్ని వారి జీవితాలను మార్చేందుకు ఉయోగపడాలి. స్థిరమైన ఆదాయాలను కల్పించే దిశగా వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఇటీవలే అమూల్‌కూడా అవగాహన ఒప్పందం చేసుకోంది.

ప్రభుత్వం చేయూత నిస్తుంది, బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తుంది. ఈ కార్యక్రమంలో ఈ కంపెనీలు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఆగస్టు 12న సుమారు రూ.4500 కోట్లు ఈ పథం కింద ఇస్తున్నాం. సెప్టెంబరులో వైయస్సార్‌ ఆసరా అమలు చేస్తున్నాం. 90 లక్షల స్వయం సహాయ సంఘాల వారికి ఆసరా అమలు చేస్తున్నాం.



చాలావరకు చేయూత అందుకున్న మహిళలకూ ఆసరా కూడా వర్తిస్తుంది. దాదాపు కోటి మందికిపైగా మహిళలకు ఆసరా, చేయూత అందిస్తాయి. దాదాపు 9 లక్షల మంది మహిళలకు దాదాపు రూ.6700 కోట్లు ఆసరా కింద ఏటా ఇస్తున్నాం. ఇలా ప్రతి ఏటా రూ.11వేల కోట్ల చొప్పున, నాలుగేళ్లపాటు రూ.44వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఈ కోటి మంది మహిళల చేతికి ఇస్తున్నాం.

ఈ సహాయం.. వారికి స్థిరమైన ఆదాయాలు ఇచ్చేదిగా, స్థిరమైన ఉపాధి కల్పించేదిగా ఉండాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, మహిళల జీవితాలను మారుస్తుంది. సమాజంలో అణగారిన వర్గాల్లోని మహిళల జీవితాల్లో వెలుగును నింపుతుంది. వారి కాళ్లమీద వాళ్లు నిలబడగలిగేలా మీరు సహకారం అందించాలి’ అని సీఎం జగన్ తెలిపారు.