కరీంనగర్లో విద్యార్థిని మర్డర్ : నిందితుడిని పట్టుకోవాలని మంత్రి గంగుల ఆదేశాలు
కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంటర్ విద్యార్థిని రాధికను దారుణంగా చంపేశాడు ఓ ప్రేమోన్మాది. ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న మంత్రి గంగుల ఘటనాప్రదేశాన్ని సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…
హత్య తర్వాత హంతకుడు కత్తిని నీళ్లతో కడిగి వెళ్లిపోయాడని, 24 గంటల్లో నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించడం జరిగిందని వెల్లడించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి దారుణాలు జరుగకుండా చూస్తామన్నారు.
సంఘటానస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నిందితుడి కోసం 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని ADSP శ్రీనివాస్ వెల్లడించారు. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
తమకు ఎవరి మీద అనుమానం లేదని అంటోంది ఇంటర్ విద్యార్థిని రాధిక తల్లి ఓదవ్వ. నా బిడ్డను దారుణంగా చంపేశారని విలపిస్తోంది. ఎవరు చంపారో…ఎందుకు..చంపారో తెలియదని వెల్లడించింది. ఇంట్లో ఒంటరిగా ఉంటూ చదువుకొంటోందని తెలిపారు.
* ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగుడు రాధిక గొంతుకోసి కిరాతకంగా చంపాడు.
* రక్తపు మడుగులో రాధిక మృతదేహం ఉంది.
* ఎవరిపైనా అనుమానాలు లేవని కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు.
* రాధిక హత్యకు ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
* పోలీసులు సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ఏమైనా క్లూ లభిస్తుందేమోనని అనుకుంటున్నారు.
* రాధిక సహస్ర జూనియర్ కాలేజీలో ఫస్టియర్ చదువుతోంది.