Woman Entrepreneur : పెళ్లికి ‘నో’ చెప్పిందని మహిళా వ్యాపారవేత్తను గంజాయి కేసులో ఇరికించిన డాక్టర్
భర్త నుంచి విడిపోయి స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించుకుంటున్న మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ ఆస్పత్రి సీఈవో. అందుకు ఆ మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెను గంజాయి కేసులో ఇరికించాడు. న్యాయం గెలిచి ఆమె నిర్దోషిగా బయటపడింది.
Woman Entrepreneur : భర్త నుంచి విడిపోయి స్వతంత్రంగా వ్యాపారం నిర్వహించుకుంటున్న మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ ఆస్పత్రి సీఈవో. అందుకు ఆ మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెను గంజాయి కేసులో ఇరికించాడు. న్యాయం గెలిచి ఆమె నిర్దోషిగా బయటపడింది.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాధన్(35) కు తిరువనంతపురంలోని లార్డ్స్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హరీష్ హరిదాస్తో రెండేళ్ల క్రితం పరిచయం అయ్యింది. ఈ పరిచయం మరింత స్నేహంగా మారటంతో వారిద్దరూ తరచూ కలుసుకుని మాట్లాడుకునే వాళ్లు.
శోభా విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితమే భర్త నుంచి విడిపోయి స్వంతంగా వస్త్ర దుకాణం నడుపుకుంటోంది. వారి విడాకుల కేసు కోర్టులో ఉంది. డాక్టర్ హరీష్ హరిదాస్ కూడా తన భార్యతో విడాకులై ఒంటరిగా ఉంటున్నాడు. ఈనేపధ్యంలో హరీష్ హరిదాస్ శోభను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు.
అందుకు ఆమె అంగీకరించలేదు. అప్పటి నుంచి అతడ్ని దూరం పెట్టింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న హరీష్ ఆమెను ఎట్టాగైన ఇబ్బందుల పాలు చేయాలని ప్లాన్ వేశాడు. శోభ షాపులో పనిచేసే వివేక్ రాజ్ అనే అతని సాయం తీసుకున్నాడు.
ఈ ఏడాదిజనవరి 21న ఆమెకు తెలియకుండా షాపులో గంజాయిని పెట్టించి….బట్టల కొట్టులో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. షాపుపై దాడి చేసిన పోలీసులు షాపునుంచి 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు షాపులో గాలింపు చేపట్టి గంజాయి స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె షాపులో లేదు. షాపు యజమాని ఆమె కనుక మాదక ద్రవ్యాల కేసులో శోభ ను అరెస్ట్ చేశారు.
దొరికిన గంజాయి కిలో కంటే తక్కువ ఉన్నందున ఆమె స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చింది. రెండు నెలల తర్వాత ఆమె ఈ విషయాన్ని సీఎం పినరయ్ విజయన్ దృష్టికి తీసుకు వెళ్లింది. తనకు న్యాయం చేయాలని కోరింది. తన షాపులో పని చేసే వాళ్లు చాలామంది ఉన్నారని, గంజాయి దొరికిన సమయంలో నేను షాపులో లేనని… షాపులో వారిని ఎవరినీ విచారించకుండా కేవలం తనను మాత్రమే అరెస్ట్ చేసి దోషిగా నిలబెట్టారని ఆమె వివరించింది. దీంతో కేసు దర్యాప్తును క్రైం బ్రాంచ్ కు ముఖ్యమంత్రి అప్పగించారు.
కేసు దర్యాప్తులో భాగంగా క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా ఆమె వద్ద పని చేసే వివేక్రాజ్ అనుమానాస్పద కదలికలను పసిగట్టారు. ఈ క్రమంలో ఆమె వివేక్ పై అనుమానం వ్యక్తం చేసింది. వారు వెంటనే సీసీటీవీ ఫుటేజి ని పరిశీలించి వివేక్రాజ్ ను దోషిగా తేల్చారు.
పోలీసు నిఘా పెరిగే సరికి వివేక్ రాజ్ పరారయ్యాడు. ఆమె హరీష్ హరిదాస్ పెళ్లి ప్రస్తావన విషయం కూడా పోలీసులకు వివరించింది. శోభను నిర్దోషిగా తేల్చిన పోలీసులు హరీష్, వివేక్ లను దోషులుగా తేల్చారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డిప్యూటీ ఎస్పీ అమ్మన్ కుట్టన్ తెలిపారు. నిందితుల్లో ఒకరైన లార్డ్స్ ఆస్పత్రి యజమాని హరీష్ హరిదాస్ … పద్మశ్రీ డాక్టర్. కె.పి.హరిదాస్ కుమారుడని పోలీసులు తెలిపారు.