Mancherial Fire Accident : మంచిర్యాల సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు.. వివాహేతర సంబంధమే కారణం?
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో జరిగిన సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Mancherial Fire Accident : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో జరిగిన సజీవదహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం వల్ల గుర్తు తెలియన వ్యక్తులు ఇంటికి నిప్పు పెట్టినట్లు పోలీసులు డౌట్ పడుతున్నారు. ఇప్పటికే ఇంటి సమీపంలో రెండు పెట్రోల్ క్యాన్లను కూడా పోలీసులు గుర్తించారు. అటు సజీవదహనం కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. కేసుని చేధించేందుకు మొత్తం 16 టీమ్స్ ను ఏర్పాటు చేశారు. కేసుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు.
సజీవదహనమైన ఆరుగురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వారు వినకపోతే పోలీసులే అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్ లో శుక్రవారం అర్థరాత్రి ఓ ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. తొలుత ఇది అగ్నిప్రమాదం అనుకున్నారు. ఆ తర్వాత.. ఈ ఘటన వెనుక పక్కా ప్లాన్ ఉందని తేల్చారు పోలీసులు. శివయ్య అనే సింగరేణి కార్మికుడి ఇల్లు దహనం ఘటన సాధారణమైనది కాదని పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో హిమబిందు (2), స్వీటీ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అసలే పెంకుటిల్లు. దానికి తోడు మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో వారంతానిద్రలోనే మాంసం ముద్దలుగా మారిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు ఇంటికి సమీపంలోనే చాలాసేపు వేచి ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంట్లోంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా? అని వారు అక్కడి వేచి చూసినట్లు సమాచారం. ఇల్లు మొత్తం పూర్తిగా దహనం అయ్యేవరకు వారు అక్కడే కాపు కాసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటికి సమీపంలో రెండు పెట్రోల్ క్యాన్లు, అక్కడే ఓ ఆటో నిలిపి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆటోలో కారంపొడి కూడా ఉందని గుర్తించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
మృతులు మాసు శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), మౌనిక(35), చిన్నారులు స్వీటీ(4), హిమబిందు(2) మరో వ్యక్తి శాంతయ్యగా(సింగరేణి కార్మికుడు, శివయ్య బంధువు) గుర్తించారు.
అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పింది. కానీ, అప్పటికే ఘోరం జరిగిపోయింది. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.