ప్రభుత్వాస్పత్రిలో దారుణం : వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన మహిళ మృతి

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 05:28 AM IST
ప్రభుత్వాస్పత్రిలో దారుణం : వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన మహిళ మృతి

గుంటూరు : సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. వైద్యులు పట్టించుకోకపోవడంతో ప్రసవం కోసం వచ్చిన మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరంకు చెందిన గంగ అనే గర్భిణీ ప్రసవం కోసం మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అయితే ఆమెను వైద్యులు పట్టించుకోలేదు. కొద్దిసేపటికే చికిత్స లేకుండానే ప్రసవించింది. ప్రసవం తర్వాత రెండు గంటలపాటు ఓవర్ బ్లీడింగ్ అయింది. 

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి లేదా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడున్న డాక్టర్లు సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ఆమె మృతి చెందింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే మహిళ మృతికి వైద్యులు, నర్సుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యులు, నర్సులపై కేసు పెట్టేందుకు వారు సిద్ధమవుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.