మహిళకు మత్తు మందిచ్చి యూట్యూబర్ అఘాయిత్యం

  • Published By: murthy ,Published On : December 12, 2020 / 12:34 PM IST
మహిళకు మత్తు మందిచ్చి యూట్యూబర్ అఘాయిత్యం

Woman Drugged, Raped, Filmed, Blackmailed in Noida : యూట్యూబ్ లో ఫిట్ నెస్ క్లాస్ లూ చెప్పే ఒక ట్రైనర్ మహిళకి మత్తు మందిచ్చి అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి రూ.13లక్షల వరకు ఆమె వద్ద నుంచి వసూలు చేశాడు. అతడి వేధింపులు భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది.

నోయిడాకు చెందిన రాజ్ కుమార్ ఫిట్ నెస్ ట్రైనర్. అతను యూ ట్యూబ్ లో ఫిట్ నెస్ క్లాసులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఫిట్ నెస్ క్లాస్ నేర్చుకుంటున్న ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత వారిద్దర మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడటంతో ఆమె అతడికి దూరంగా ఉండటం మొదలెట్టింది. తనను దూరం పెట్టటం భరించలేని రాజ్ కుమార్ ఆమెపై పగ పెంచుకున్నాడు.

ఆమెను ఎలాగోలా దెబ్బకొట్టి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. పధకంలోభాగంగా తనను కలవాలని ఉందంటూ ఆమెను ఒక చోటికి రప్పించాడు. అక్కడ ఆమెతో రాజీ ధోరణిలో మాట్లాడాడు. స్నేహం కొనసాగిద్దామని బతిమలాడాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆమెతో మంచిగా మాట్లాడుతూనే ఆమెతో మత్తు మందు కలిపిన డ్రింక్ తాగించాడు. తాగిన తర్వాత బాధితురాలు స్పృహ తప్పి పడిపోగానే ఆమెపై లైంగిక దాడి చేశాడు.

ఆమెపై చేసిన లైంగిక దాడిని వీడియోగా చిత్రీకరించాడు. ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. రూ.13లక్షలు ఇస్తే వీడియోను ఇచ్చేస్తానని చెప్పాడు. ఆమె అతనికి ఆ మొత్తం చెల్లించింది. డబ్బు తీసుకున్న తర్వాత ఆ వీడియోను రాజ్ కుమార్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. డబ్బు ఇచ్చినా తనను మోసం చేయటంతో బాధితురాలు అతడ్ని నిలదీసింది. వీడియో డిలీట్ చేస్తానని చెప్పి మళ్లీ డబ్బులు కావాలంటూ బేరాలు మొదలెట్టాడు.

అతడి ఆగడాలు పెరిగిపోవటంతో బాధితురాలు అక్టోబర్ 27న సెక్టార్ 39 పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. శుక్రవారం డిసెంబర్ 11న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గౌతం బుద్ధానగర్ డీసీపీ వృందా శుక్లా తెలిపారు.