Indonesia Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు.. సునామీ ముప్పుపై అధికారులు ఏమన్నారంటే..
ఇండోనేషియాలోని ఉత్తరాన అచే ప్రావిన్స్లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 6.2 తీవ్రతగా అధికారులు గుర్తించారు.
Indonesia Earthquake: ఇండోనేషియాలోని ఉత్తరాన అచే ప్రావిన్స్లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం 6.2 తీవ్రతగా అధికారులు గుర్తించారు. 49 కిలోమీటర్ల లోతులో అచే ప్రావిన్స్లోని తీరప్రాంత నగరమైన మీలాబోహ్కు దక్షిణ-నైరుతి దిశలో 40 కిలోమీటర్లు (24.8 మైళ్లు) కేంద్రీకృతమై ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. సముద్రగర్భంలో భూకంపం రావడంతో సునామీ ముప్పు ఉందన్న ఆందోళన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే, సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు.
Indonesia Earthquake : ఇండోనేషియాలో 7.3 తీవ్రతగా భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ
తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పుడు ప్రజలు తమ ఇళ్ల నుండి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారని, అయితే సునామీ ప్రమాదం లేదని వారికి టెక్స్ట్ సందేశాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 2004లో అచే తీరంలో సంభవించిన భారీ భూకంపం ఒక శక్తివంతమైన సునామీకి కారణమైంది. ఆ సమయంలో ఇండోనేషియాలో 2,30,000 మందిని మరణించారు.
ఇండోనేషియాలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీల వంటి విపత్తుల తరచూ జరుగుతుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 25 మంది మరణించారు, 460 మందికి పైగా గాయపడ్డారు. జనవరి 2021లో, పశ్చిమ సులవేసి ప్రావిన్స్లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 100 మందికి పైగా మరణించారు, దాదాపు 6,500 మంది గాయపడ్డారు.